అరంగేట్రం చేసిన అనతికాలంలోనే బాలీవుడ్ చిత్రసీమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామ’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు కెరీర్లోనే భారీ ఆఫర్ను చేజిక్కించుకుంది. వివరాల్లోకి వెళితే..శంకర్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా రూపొందిన ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) చిత్రం దక్షిణాదిన సంచలనం సృష్టించింది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో ఓ కల్ట్ మూవీగా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని హిందీలో రణ్వీర్సింగ్ హీరోగా దర్శకుడు శంకర్ రీమేక్ చేయబోతున్నారు. జయంతిలాల్ గడా నిర్మాత. ఈ ఏడాదే సెట్స్మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాణీని ఖరారు చేసినట్లు తెలిసింది. తొలిసారి పాన్ ఇండియా సినిమాలో నాయికగా స్థానం దక్కించుకోవడం పట్ల కియారా అద్వాణీ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమా జాతీయస్థాయిలో తన కెరీర్కు ఊపునిస్తుందని పేర్కొంది.