సినీ తారలు చాలామంది తమ ప్రేమ వ్యవహారాల గురించి బాహాటంగా స్పందించే సాహసం చేయరు. ఫలానా వ్యక్తితో ప్రేమలో ఉన్నామని చెబితే మీడియా వారితో పాటు అభిమానుల నుంచి ఒత్తిడి ఎదురవుతుందనే భావనలో ఉంటారు. ముఖ్యంగా సోషల్మీడియాలో అభిమానుల నుంచి ప్రశ్నలపరంపర ఎదుర్కోవాల్సి ఉంటుందని భయపడతారు. అయితే సహచర నటులతో తమకున్న సాన్నిహిత్యం, ప్రేమ గురించి అన్యాపదేశంగా తెలియజేసే ప్రయత్నం మాత్రం చేస్తారు. ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ అదే పద్ధతిని ఫాలో అవుతున్నది. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ఈ భామ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట తమ బంధం గురించి ఎక్కడా బయటపడలేదు. వీరిద్దరు కలిసి నటించిన ‘షేర్షా’ చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ టీవీ షోలో పాల్గొన్న కియారా అద్వాణీ తన ప్రేమాయణం గురించి పరోక్షంగా ప్రస్తావించింది. ఇండస్ట్రీలో సిద్ధార్థ తనకు అత్యంత ఆప్తుడని, ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి సదా సిద్ధంగా ఉంటాడని చెప్పింది. అతను పక్కనుంటే ఆనందం అంటే ఏమిటో అర్థమవుతుందని పొగడ్తలతో ముంచెత్తింది. వృత్తిపట్ల అంకితభావం, కష్టపడేతత్వం విషయంలో సిద్ధార్థతో ఎవరూ పోటీరాలేరని తెలిపింది. ఇద్దరి అభిరుచులు దాదాపుగా ఒకటేనని..తమ ఇద్దరి బంధం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడి మాటలతో సిద్ధార్థతో ప్రేమబంధం నిజమేనని అభిమానులు రూఢీ చేసుకుంటున్నారు.