హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): చైనా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసు దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ముమ్మరం చేశారు. అక్రమ బెట్టింగ్లతో సంపాదించిన రూ. వేల కోట్లను నిందితులు క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాల్లోని బినామీ ఖాతాల్లోకి మళ్లించినట్టు కీలక ఆధారాలు సేకరించారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరిపే వజిర్క్స్ కంపెనీతోపాటు కంపెనీ డైరెక్టర్లు నిశ్చల్శెట్టి, సమీర్ హనుమాన్ మాత్రేలకు ఫెమా(ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్-1999) చట్టం కింద శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఆయా లావాదేవీలపై వివరాలు ఇవ్వాలని కోరారు. మొత్తం రూ.2790.74 కోట్ల విలువైన కిప్ట్రో కరెన్సీని విదేశాలకు తరలించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ఆన్లైన్ అక్రమ బెట్టింగ్ల ద్వారా కొందరు చైనీయులు భారత్లో సంపాదించిన సొమ్ము ను క్రిప్టో కరెన్సీగా మార్చి.. వాటిని విదేశాల్లోని బినామీ ఖాతాల్లో జమచేశారు. అవసరమైన పత్రాలను సేకరించకుండానే క్రిప్టో కరెన్సీ లావాదేవీలతోపాటు విదేశీ ఖాతాల్లో లావాదేవీలు జరిపేందుకు వ్యక్తిగతంగా అనుమతించినట్టు అధికారులు గుర్తించారు. ఇవన్నీ ఏఎంఎల్ (యాంటీ మనీ లాండరింగ్) చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.