రంగారెడ్డి, మే 25, (నమస్తే తెలంగాణ): జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓ వైపు పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేయడం, మరోవైపు ఇంటింటి ఫీవర్ సర్వేతో పాజిటివ్ కేసులు తగ్గి, రికవరీ రేటు పెరుగుతుండడం గమనార్హం. దవాఖానల్లో చేరిన బాధితులతోపాటు హోం ఐసోలేషన్లో ఉన్న వారంతా నిర్ణీత సమయం కంటే ముందుగానే కోలుకుంటున్నారు. హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్న వారిలో దాదాపు అందరూ కోలుకుంటున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,288 ఉండగా, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6012 కేసులు ఉన్నాయి. గడిచిన 14 రోజుల్లో జిల్లాలో దాదాపు 10 వేల మంది వరకు మహమ్మారి నుంచి కోలుకోవడం గమనార్హం.
వేగంగా కోలుకుంటున్న బాధితులు..
జిల్లాలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. రోజుకు 500-600 మంది రికవరీ అవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో లాక్డౌన్ ప్రారంభమైన 14 రోజుల్లో దాదాపు 10 వేలకు పైగా కరోనా బాధితులు కోలుకున్నారు. కఠినంగా అమలు చేస్తున్న లాక్డౌన్, కొనసాగిస్తున్న ఫీవర్ సర్వేతో పాజిటివ్ కేసులు తగ్గుతుండడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో 20 గంటలపాటు లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తూ, అత్యవసర సర్వీసులు మినహా ఎవరినీ బయటకు రానివ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే నిత్యావసర సరుకుల కొనుగోలుకు సడలింపు ఇస్తున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటింటి ఫీవర్ సర్వేతో కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతోపాటు వైరస్ వ్యాప్తి కట్టడి అవుతున్నది.
లాక్డౌన్కు ముందు జిల్లాలో రోజుకు 400-500 వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 15-20 శాతం మేర పాజిటివ్ కేసులు తగ్గినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 200ల కేసుల కంటే ఎక్కువగా పెరుగకపోవడం గమనార్హం. జిల్లాలో దాదాపు 20 రోజులుగా నిర్వహిస్తున్న ఇంటింటి ఫీవర్ సర్వేలో భాగంగా ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులతో కూడిన బృందాలు ప్రతీ కుటుంబానికి సంబంధించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఇంటింటి ఫీవర్ సర్వేను రెండు విడుతలు ఇప్పటికే పూర్తి కాగా, మూడో విడుత సర్వే నిర్వహించారు. మొదటి సారి ఇంటింటి సర్వేలో భాగంగా కొవిడ్ లక్షణాలున్నట్లు గుర్తించిన కుటుంబాలను నాలుగు రోజుల అనంతరం రెండోసారి సర్వే నిర్వహించి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. లక్షణాలున్నట్లయితే కరోనా పరీక్షలు చేసి, మెడికల్ కిట్లను అందజేశారు.
కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది..
జిల్లాలో క్రమంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నది. లాక్డౌన్, ఫీవర్ సర్వేతో సత్ఫలితాలు వస్తున్నాయి. పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లాలో పాజిటివ్ కేసులు 15-20 శాతం మేర తగ్గాయి. హోం ఐసోలేషన్లో ఉన్నవారు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో తొందరగా కోలుకుంటున్నారు.