హైదరాబాద్: నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ కుమార్ను టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి , పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి , సాగర్ టిఆర్ఎస్ నాయకులు ఎంసి కోటిరెడ్డి, నోముల లక్ష్మి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తల్లి నోముల లక్ష్మితో కలిసి భగత్ తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. భగత్కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నాడు.
2014లో టీఆర్ఎస్లో చేరిన భగత్ 2014-18 ఎన్నికల సమయంలో ఆ స్థానంలో పోటీ చేసిన తన తండ్రి నర్సింహయ్యకు ఆర్గనైజర్ గా, 2018 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహకుడిగా పార్టీకి సేవలందించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో సైతం భగత్ చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ఆదుకోవడంలో ముందుంటారు.
1984 అక్టోబర్ 10న జన్మించిన భగత్ ఇంజినీరింగ్ చదివి.. ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎల్ఎల్బీ పూర్తి చేశారు. హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తూనే ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు. 2010-2012 సమయంలో సత్యం కంపెనీలో జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేశారు. విస్టా ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్లో మేనేజర్ గా కూడా సేవలందించారు. 2014-2018 వరకు హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశారు. న్యాయవాదిగా ఎంతోమంది సామాన్యులకు న్యాయసేవ చేస్తున్నారు.
కుటుంబ నేపథ్యం:
తల్లి- నోముల లక్ష్మి
భార్య – నోముల భవానీ
కుమారుడు – నోముల రానాజయ్
కుమార్తె- నోముల రేయాశ్రీ
చిరునామా: బృందావనం కాలనీ, హాలియా, నల్గొండ జిల్లా