ఒకనాడు తెలంగాణ పల్లెల్లో పంటచేలల్లో, ధాన్యపు రాశుల చుట్టూ, గుడిసెల చూరు కింద, పందిళ్లపై కిలకిలమంటూ ఊరపిచ్చుకలు ఎంతగానో సందడి చేసేవి. రైతులు వరి గొలుకలను తెంపుకొచ్చి గుడిసె చూరుకో, పందిరి గుంజలకో కట్టేవారు. పిచ్చుకలు కిలకిల రావాలతో ఎగురుకుంటూ వచ్చి వరి గొలుకలకు ఉన్న గింజల్ని తినే సుందర దృశ్యాలన్నీనేడు కనుమరుగయ్యాయి.
గడ్డి పరకలు, పుల్లలు ఏరుకొని వచ్చి పిచ్చుకలు ఒక్కొక్క పోచతో ఎంతో శ్రద్ధగా అల్లే గూళ్లు గొప్ప ఆర్కిటెక్చర్లను మించిపోతాయి. ఎంతో క్లిష్టమైన అల్లికలతో రూపొందే గూళ్లు గుడిసెల చూరుకింద, దిగుడు బావుల్లో, చెట్టు కొమ్మలకు వేలాడుతూ కనువిందు చేసేవి. గూళ్లలోనే పొదిగిన గుడ్ల నుంచి వచ్చిన పిల్లలకు తల్లి పిచ్చుకలు ఊరంతా తిరిగి ఆహారాన్ని తీసుకొచ్చి నోటితో అందిం చే అమ్మతనపు అద్భుత దృశ్యాలు కనిపించేవి.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త వసతులను అందుబాటులోకి తెస్తున్నా, వాటి మరోకోణం దుష్ఫలితాలకు దారితీస్తున్నది. పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నది. పరిమితికి మించిన సెల్ తరంగాల రేడియేషన్ కారణంగా కొన్ని పక్షిజాతులు అంతరించిపోతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆ క్రమంలోనే ఊరపిచ్చుకలు కనుమరుగవుతున్నాయి.
మనిషి, ఇతర జీవజాతులు, అడవులు, వాతావరణ పరిస్థితులు, నీరు, గాలి అనేవి ప్రకృతిలో భాగం. వీటన్నింటి మధ్య సమతుల్యం ఉన్నప్పుడే సమాజం సజావుగా నడుస్తుంది. వివిధ జీవుల మధ్య ఉన్న ఆహార సంబంధాల కలయిక ఆహారపు గొలుసును ఏర్పరుస్తుంది. ఈ ఆహారపు గొలుసులో ఒక జీవికి మరో జీవి ఆహారమవుతుంది. ఆ రకంగా అన్ని జీవుల జనాభా సహజంగా నియంత్రితమవుతుంది. పిచ్చుకలు మిడతలకు సహజ శత్రువులుగా ఉంటూ మిడతల జనాభాను అదుపులో ఉంచుతాయి. ఇటీవల ఉత్తర భారతంలో మిడతల దండు చేసిన నష్టానికి పిచ్చుకల జనాభా తగ్గడం కారణం.
గోడౌన్లలో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఒక్కో పిచ్చుక సంవత్సరానికి 1.8 కిలోల మేర తినడం వల్ల ఆహార కొరత ఏర్పడిందనే అభిప్రాయంతో చైనా ప్రభుత్వం 1958లో పిచ్చుకలపై యుద్ధం చేయాలని ఆదేశించింది. దీంతో సాధారణ ప్రజలు, రైతులు 1960కల్లా దాదాపు 30 లక్షల పిచ్చుకలను చంపేశారు. తర్వాత కొందరు శాస్త్రవేత్తలు చనిపోయిన పిచ్చుకలపై జరిపిన పరిశోధనల్లో-వాటి జీర్ణాశయంలో నాలుగింట మూడో వంతు పంటలను నాశనం చేసే మిడతలుండగా, ఒక వంతు మాత్రమే ధాన్యపు గింజలున్నట్లు తేలింది. పిచ్చుకలు మానవులకు మంచి చేస్తాయని శాస్త్రవేత్తలు చైనా ప్రభుత్వానికి తెలుపడంతో పిచ్చుకలపై యుద్ధాన్ని ఆపేశారుగానీ, అప్పటికే నష్టం జరిగిపోయింది. విపరీతంగా పెరిగిపోయిన మిడతలను చంపడానికి ఎక్కువ పురుగుమందులు వాడటంతో భూమి కలుషితమైపోయి పంటలు సరిగా పండలేదు. తద్వారా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రకృతిలో ఏ జీవి లేకపోయినా దాని ప్రభావం ఇతర జీవులపై పడుతుంది. ప్రకృతికి విరుద్ధంగా ఏ పనీ చేయకూడదు. రైతులకు ఉపయోగపడే పిచ్చుకల మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో ప్రపంచ దేశాలు ఏటా మార్చి 20న పిచ్చుకల దినాన్ని నిర్వహిస్తున్నాయి. భారత ప్రభుత్వం తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. జనావాసాల మధ్య నివసిస్తున్న పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మానవ మనుగడకు కూడా ప్రమాదకరమే అన్న ఎరుక కలగాలి.
(నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం)
వినయ్కుమార్ కొట్టే