అప్పర్ మానేరుకు చేరిన కాళేశ్వరగంగ
75 ఏండ్ల ప్రాజెక్టు చరిత్రలో అద్భుత ఘట్టం
రైతుల సంబురాలు.. గోదారమ్మకు హారతులు
కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
సరిగ్గా పదమూడేండ్ల క్రితం.. 2008 ఏప్రిల్ 11న ఎగువమానేరు వద్ద నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజేఖర్రెడ్డి పైలాన్ను ఆవిష్కరించారు. అక్కడే జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ‘పదమూడున్నర లక్షల ఎకరాల సాగుభూమికి నీరందించే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును నాలుగేండ్లలో పూర్తిచేస్తాం. కరీంనగర్ జిల్లాలోని ఎగువ మానేరు ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోయడానికి కావాల్సిన పనులను మూడేండ్లలోగా పూర్తిచేస్తాం. సిరిసిల్ల ప్రాంతంలోని 80వేల ఎకరాలకు సాగు, ప్రజలకు తాగునీటిని అందిస్తాం’ అని చెప్పారు. ఆ తర్వాత ఆరేండ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎగువ మానేరు కోసం తట్టెడుమట్టి ఎత్తింది లేదు.. చుక్కనీరు ఇచ్చిందీ లేదు.
2015 ఫిబ్రవరి 23న గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు వద్ద గల అతిథిగృహంలో నీటి పారుదలశాఖ ఇంజనీర్లు, అధికారులతో నాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. అదేరోజు ముస్తాబాద్లో జరిగిన సభలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ సూచనల మేరకు మెట్టప్రాంతమైన ముస్తాబాదే కాదు, ఎగువమానేరుకు కూడా నీటిని తెచ్చి తీరుతామని స్పష్టంచేశారు. చెప్పినట్టే.. ఆరేండ్లలోనే గోదావరి తరలివచ్చింది. కూడవెల్లి వాగు ద్వారా చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు దుంకుతూ సోమవారం ఎగువమానేరును ముద్దాడింది.
కరీంనగర్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అనేక బరాజ్లు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, చెక్డ్యాంలను దాటుకుంటూ కాళేశ్వరం జలాలు ఎగువ మానేరుకు చేరాయి. సమైక్య రాష్ట్రంలో నెర్రెలు బారిన నేలలను ముద్దాడాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద కూడవెల్లి, పాల్వంచ వాగులపై 1945-51 మధ్య నిజాంకాలంలో ఎగువమానేరు ప్రాజెక్టును నిర్మించారు. రెండు టీఎంసీల సామర్థ్యంగల ఈ ప్రాజెక్టు పరిధిలో 13 వేల ఎకరాల ఆయకట్టును నిర్ధారించారు. నాటినుంచి ఈ ప్రాజెక్టు ఎన్నికల ప్రచారంగా మారిందే తప్ప.. చుక్కనీరు తెచ్చి ఆయకట్టును తడిపిందిలేదు. 75 ఏండ్ల చరిత్రలో తొలిసారిగా సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎగువ మానేరుకు గోదావరి జలాలు చేరుకున్నాయి.
మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకుతున్న చెరువులు, వాగుల ద్వారా వందల కిలోమీటర్లు ప్రయాణించి కూడవెల్లివాగు ద్వారా ఎగువమానేరుకు వచ్చిన కాళేశ్వర గంగను చూసి రైతులు సంబురాల్లో మునిగిపోయారు. గోదారమ్మకు హారతులు ఇవ్వడంతోపాటు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా.. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ-రంగనాయకసాగర్-మల్లన్నసాగర్- కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు నీటిని ఎత్తిపోస్తున్న విషయం తెలిసిందే. మల్లన్నసాగర్ పరిధిలోని తుక్కాపూర్ పంపుహౌస్ నుంచి కొండపోచమ్మ కెనాల్ద్వారా వెళుతున్న నీటిని గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కూడవెల్లి వాగులోకి ఇటీవలే విడుదల చేశారు. అక్కడినుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పరిధిలోని ఎగువమానేరు ప్రాజెక్టుకు నీటి నివ్వాలని మంత్రి కేటీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు కూడవెల్లి వాగుపై ఉన్న సుమారు 35 చెక్డ్యాంలను నింపుకొని మత్త ళ్లు దుంకుతూ.. 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగువమానేరుకు సోమవారం మధ్యాహ్నానికి గోదావరి జలాలు చేరుకున్నాయి.
ఆచరణ సాధ్యంచేసిన సీఎం కేసీఆర్
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎగువ మానేరుకు గోదావరి జలాలు తెచ్చి సీఎం కేసీఆర్ ఆచరణ సాధ్యం చేశారు. సిరిసిల్ల జిల్లాలోని మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఇప్పటికే శ్రీరాజరాజేశ్వర జలాశయం నీటిని వినియోగించుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-9 పనులను శరవేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్యాకేజీ-11 కింద రంగనాయకసాగర్ రిజర్వాయర్ ద్వారా సిరిసిల్ల జిల్లాలో 58 చెరువులను నింపుతున్నారు. ఈ ప్యాకేజీ కింద ముస్తాబాద్ మండలంలో 2,279, ఇల్లంతకుంట మండలంలో 9,730 ఎకరాలు, తంగళ్లపల్లి మండలంలో 21,375 ఎకరాలు కలిపి మొత్తం 33,384 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు చేపట్టిన పనులు చివరిదశకు చేరుకున్నాయి. దీని పరిధిలో ఇప్పటికే పలు చెరువులను నింపారు. ప్యాకేజీ-12 కింద మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా సిరిసిల్లలోని 29 చెరువులను నింపేందుకు పనులు జరుగుతున్నాయి. దీనిద్వారా ముస్తాబాద్ మండలంలో 12,929, గంభీరావుపేట మండ లంలో 9,047 ఎకరాలు కలిపి మొత్తం 21,976 ఎకరాల ఆయకట్టు సస్యశ్యామల మవుతున్నది.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
గోదావరి జలాలు ఎగువమానేరుకు చేరుకోవడంపై రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతోపాటు గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల ప్రజాప్రతినిధులు, రైతులు శ్రీగాధ వంతెన వద్ద కాళేశ్వరం జలాలకు హారతులు పట్టారు. అనంతరం సీఎం కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కూడవెల్లి వాగుద్వారా 1,300 క్యూసెక్కుల నీరు వస్తున్నదని, వారంలోనే కాళేశ్వరం జలాలతో ఎగువ మానేరు నిండుకుండలా మారుతుందని ఈఎన్సీ హరిరాం ఫోన్లో తెలిపారు.
మాటలకే పరిమితమైన కాంగ్రెస్
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరును వాడుకొని పలు ఎన్నికల్లో లబ్ధిపొందిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది. దీనికి నిలువెత్తు సాక్ష్యమే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువమానేరు వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 2008లో ఆవిష్కరించిన పైలాన్. మూడేండ్లలోనే ఎగువ మానేరుకు నీళ్లిచ్చి తీరుతామని నాటి సభావేదికగా ప్రకటించారు. కానీ, తర్వాత ఆరేండ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎగువమానేరుకు నీళ్లు తీసురాలేకపోయారు.