సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేష్ కన్నుమూశారు. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించడంతో శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. గత నెల 26న నెల్లూరు జిల్లా చంద్రశేఖరపురం వద్ద కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన తల, కళ్ల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. పలు శస్త్ర చికిత్సలు చేసిన వైద్యులు.. ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. అయితే హఠాత్తుగా శనివారం ఆరోగ్యం విషమించడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కోలుకుంటున్నాడని భావించిన కత్తి మహేష్ మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు షాక్కు గురయ్యారు. ఆయన మృతి వార్తను తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతున్నారు. కత్తి మహేష్ చిత్తూరు జిల్లాలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు.
సినీ దర్శకుడు కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన పలు సినిమాలకు డైరెక్టర్గా, అసెస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించారు. అయితే దర్శకత్వంలో సక్సెస్ కాకపోవడంతో నటుడిగా మారారు. హృదయకాలేయం, నేనే రాజు నేనే మంత్రి, క్రాక్ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. అదే విధంగా బిగ్ బాస్లో కంటెస్టెంట్గానూ పాల్గొన్నారు. నటుడిగా కన్నా సినీ విశ్లేషకుడిగా ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. గతంలో పవన్ కల్యాణ్పై, రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారారు. మత విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయన్ను హైకోర్టు హైదరాబాద్ నగర బహిష్కరణ కూడా చేసింది. ఇదిలా ఉంటే కత్తి మహేష్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను షాక్కు గురి చేసిందన్న నటుడు మంచు మనోజ్, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.