సూర్య సోదరుడు, తమిళ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపు తెలుగులో విడుదల అవుతుంటాయి. నాగార్జునతో కలిసి ఊపిరి అనే సినిమా చేసిన కార్తీ తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు. ఆయన నటించిన చాలా చిత్రాలు తెలుగులో బాగా హిట్ అయ్యాయి.
కెరీర్ మొదటినుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను తన ఖాతాలోవేసుకుంటున్నాడు కార్తీ. ఆయన నటించిన ఆవారా, ఖాకీ, ఖైదీ లాంటి సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కార్తీ ఇప్పుడు మరి సినిమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
కార్తీ హీరోగా నటించిన “మద్రాస్” సినిమా 2014లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పుడే విడుదల కావలసి ఉన్నప్పటికీ వాయిదా పడింది. దాదాపు ఏడేళ్ల తర్వాత దర్శక నిర్మాతలు ఈ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు. తాజాగా తెలుగు వెర్షన్కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. కార్తీ లుక్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సెప్టెంబర్లో సినిమా విడుదల చేయనున్నట్ట పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు.
ఏడేళ్ల తర్వాత థియేటర్లలోవస్తున్న ఈ సినిమాని డ్రీమ్స్ ఫ్యాక్టరీ, స్టూడియో గ్రీన్ మరియు కలసంఘం ఫిలిమ్స్ నిర్మిస్తుండగా, ఈ సినిమాలో కార్తీ సరసన కేథరిన్ తెరెసా హీరోయిన్గా నటిస్తుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా, ప్రస్తుతం కార్తీ పొన్నియన్ సెల్వన్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.