తిరుపతి, మే 5: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 13వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మే 18 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు.
ఉదయం 8.30 నుంచి10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనున్నది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 11 గంటల నుంచిసర్వదర్శనానికి అనుమతిస్తారు.