న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య సుమారు నాలుగు లక్షలకు, రోజువారీ మరణాల సంఖ్య మూడు వేలకుపైగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆసుత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్, ఔషధాలకు కొరత ఏర్పడింది. దీంతో భారత్లో కరోనా సంక్షోభంపై ప్రపంచ దేశాలు స్పందించాయి. తమకు తోచిన సహాయాన్ని అందించాయి. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, రెమ్డెసివిర్తోపాటు ఇతర మందులు, మాస్కులు, పీపీఈ కిట్లను భారత్కు పంపించాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి గత ఐదు రోజుల్లో 25 విమానాల ద్వారా 300 టన్నుల కార్గో చేరినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఏప్రిల్ 28 నుంచి మే 2 వరకు అమెరికా, బ్రిటన్, యూఏఈ, జర్మనీ, చైనా, ఉజ్బెకిస్తాన్, థాయిలాండ్, ఖతార్, హాంకాంగ్, సింగపూర్ తదితర దేశాలకు చెందిన 25 విమానాల్లో 300 టన్నుల కార్గో చేరిందని చెప్పారు. భారత వాయు సేనకు చెందిన ఐఎల్76, సీ-130, సీ-5, సీ-17 వంటి విమానాలు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయని వివరించారు.
దేశంలో కరోనా సంక్షోభం నేపథ్యంలో సుమారు 5,500 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, సుమారు 3,200 ఆక్సిజన్ సిలిండర్లు, 9,28,000 మాస్క్లు, 1,36,000 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు వంటివి విదేశాల నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరాయని అధికారులు తెలిపారు. సహాయక సామగ్రి నిల్వ, పంపిణీ కోసం విమానాశ్రయంలో 3,500 చదరపు మీటర్ల డెడికేటెడ్ లాజిస్టిక్స్ సదుపాయమైన జీవోడే గిడ్డంగి ఉన్నదని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (డీఐఏఎల్) పేర్కొంది.