చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అత్యధిక స్ధానాల్లో ఆధిక్యంతో దూసుకెళుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుతున్నాయి. ఎన్నికల ఫలితాలపై తమ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోందని అయితే ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఎవరూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు తమ ఇండ్లలోనే హర్షాతిరేకాలు వ్యక్తం చేయాలని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ పేర్కొన్నారు.
పార్టీ నేతల సూచనలకు అనుగుణంగా కార్యకర్తలు నడుచుకోవాలని స్పష్టం చేశారు. తమది బాధ్యతాయుత రాజకీయ పార్టీ అని ఈసీ నిబంధనలను పార్టీ కార్యకర్తలు ఉల్లంఘించరాదని ఆయన కోరారు. ఇక 234 అసెంబ్లీ స్ధానాలకు గాను డీఎంకే కూటమి 146 స్ధానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుండగా, ఏఐఏడీఎంకే కూటమి 87 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఎంఎన్ఎం ఒక స్ధానంలో ఆధిక్యంలో ఉంది.