ఇప్పటివరకు రూ.2.70 కోట్లు వసూలు
ఆస్తిపన్ను చెల్లించేవారికి 5శాతం రాయితీ
కార్పొరేషన్, ఏప్రిల్ 28: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఇటీవల 2020-21 ఆర్థిక సంవత్సరం ముగియగా.. మార్చిలో అధిక మొత్తంలో ఆస్తి పన్ను వసూలుపై అధికారులు దృష్టి సారించారు. కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ముందస్తు ఆస్తి పన్ను వసూలుపై అధికారులు దృష్టి సారించగా సత్ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్ర మున్సిపల్ శాఖ ఏటా ఆర్థిక సంవత్సరం ఆరంభ నెల ఏప్రిల్లో ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5శాతం రిబేట్ అందిస్తున్నది. ఈ విషయంలో రెండేళ్లు అన్ని మున్సిపాలిటీల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు. ఈ వసూళ్లను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర మున్సిపల్ శాఖ అన్ని మున్సిపాలిటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు ఆస్తి పన్ను (ఎర్లీబర్డ్) వసూళ్లపై కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు దృష్టి సారిస్తున్నాయి. ఈసారి కరీంనగర్ నగరపాలక సంస్థ సుమారుగా రూ.2.70 కోట్ల మేరకు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. గత రెండేళ్లుగా ఎర్లీ బర్డ్ (ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపు) పథకానికి నగరవాసుల నుంచి మంచి స్పందన వస్తున్నది. గతేడాది కూడా ఇదే స్థాయిలో పన్ను వసూలైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సారి కరోనా సేకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ పన్నులు వసూలవుతున్నట్లు తెలిపారు.
మరో రెండు రోజులే గడువు
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30లోగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రిబేట్ అందిస్తున్నది. గడువు మరో రెం డు రోజులు మాత్రమే ఉంది. దీంతో బల్దియా బిల్ కలెక్ట ర్లు సాధ్యమైనంత ఎక్కువగా పన్నులు వసూలు చేసేందు కు చర్యలు చేపట్టారు. పన్ను చెల్లింపుదారులకు ఫోన్ కా ల్స్, సమాచారం అందించి సకాలంలో చెల్లించి రాయితీలను పొందాలని కూడా సూచిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే నగరపాలక అధికారులు స్వచ్ఛ ఆటోల ద్వారా ప్రచారం కొనసాగిస్తున్నారు. వీటితో పాటుగా బిల్ కలెక్టర్లు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండడంతో వసూళ్ల మొత్తం కూడా పెరుగుతుంది. ఈ రెండు రోజుల గడువులో మరో రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.