అయిజ, ఏప్రిల్ 20 : అయిజ మున్సిపాలిటీతోపాటు, మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాములోరి కల్యాణం నిరాడంబరంగా నిర్వహించేందుకు మంగళవారం ఆయా ఆలయాల్లో దేవస్థాన కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి ఉత్సవాలకు ఆలయాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పట్టణంలోని అశ్వర్థనారాయణస్వామి ఆలయం, మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామి , గరుఢాంజనేయస్వామి, శివాంజనేయస్వామి ఆలయాలతోపాటు, మండలంలోని ఉత్తనూరు, ఉప్పల క్యాంపు, పులికల్, సింధనూరు, కిసాన్నగర్, తుపత్రాల తదితర గ్రామాల్లోని రామాలయాల్లో రాములోరి కల్యాణం నేటి ఉదయం 11.45 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయాల కమిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా నిర్వహించే కల్యాణానికి భక్తులు అశేష సంఖ్యలో తరలివచ్చేవారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిమితమైన భక్తుల నడుమ వేడుకలు నిర్వహించేందుకు ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇండ్ల వద్దే ఉండి ప్రచార మాధ్యమాల ద్వారా రాములోరి కల్యాణం వీక్షించి తన్మయత్వం చెందాలని భక్తులకు అధికారులు సూచిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలంకరణ చేశారు.
నేడు శ్రీరామనవమి
గట్టు, ఏప్రిల్ 20 : శ్రీరామనవమి పురస్కరించుకొని కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా బుధవారం సీతారాముల కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. గట్టులోని గండి ఆంజనేయస్వామి, పెంచికలపాడులోని ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించనున్నారు. గట్టు గండి ఆంజనేయస్వామి ఆలయంలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి ఉత్సవ విగ్రహాలను ఇప్పటికే ప్రతిష్ఠించారు. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీసాయి రైస్మిల్ యజమాని పెద్దఅంబూసా భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.