‘ఈ సినిమాలో కథానాయికగా నా పేరును సూచించింది రచయిత విజయేంద్రప్రసాద్. తొలుత ఆయన నాకు జయలలిత జీవిత కథ గురించి చెప్పినప్పుడు అలాంటి గొప్ప పాత్రకు నేను సరిపోతానో లేదో అని సందేహించాను. ఇప్పుడు తెరపై నన్ను చూసుకుంటే విజయేంద్రప్రసాద్ది రైట్ ఛాయిస్ అనే భావన కలిగింది’ అని చెప్పింది కంగనారనౌత్. ఆమె టైటిల్ రోల్లో.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం ‘తలైవి’. ఏ.ఎల్.విజయ్ దర్శకుడు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్లో ట్రైలర్ను విడుదల చేశారు.
కంగనారనౌత్ మాట్లాడుతూ ‘నాకు తమిళ రాజకీయాలు, సినిమాల గురించి పెద్దగా తెలియదు. విజయేంద్రప్రసాద్ నాలో నమ్మకాన్ని నింపారు. ఓ మహిళా ప్రధాన చిత్రాన్ని ఇంతటి భారీ బడ్జెట్లో నిర్మించడం ఓ రికార్డు. అందుకు నిర్మాతల్ని అభినందిస్తున్నా’ అని తెలిపింది. జయలలిత పాత్రలో కంగనారనౌత్ అద్భుతాభినయం కనబరిచిందని విజయేంద్రప్రసాద్ చెప్పారు. నిర్మాత విష్ణు ఇందూరి మాట్లాడుతూ ‘జయలలిత చరిత్ర దేశప్రజలందరికి తెలియాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశాం. ఈ చిత్రం ద్వారా కంగనారనౌత్కు ఐదోసారి జాతీయ అవార్డు రావడం తథ్యమని నమ్ముతున్నా’ అన్నారు. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం శ్రమించామని శైలేష్సింగ్ తెలిపారు. ఈ సినిమాలో నటించడం తన కెరీర్లోనే గొప్ప అనుభవమని అరవింద్స్వామి అన్నారు. ‘తలైవి’ని తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముందని దర్శకుడు విజయ్ పేర్కొన్నారు.