న్యూఢిల్లీ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య 12 నుంచి 16 వారాల గ్యాప్ అవసరమని ప్రభుత్వ కమిటీ సూచించిన నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పారదర్శకతను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. తొలుత కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు తీసుకోవాలని..ఆపై 6-8 వారాల విరామం ఉండాలని చెప్పారు..తాజాగా రెండు డోసుల మధ్య 12-16 వారాల వ్యవధి ఉండాలని చెబుతున్నారని జైరాం రమేష్ పేర్కొన్నారు.
అసలు తగినన్ని వ్యాక్సిన్ నిల్వలు లేనందున ఇలా చెబుతున్నారా లేక శాస్త్రీయ ఆధారాలతో ఇలా సిఫార్సు చేస్తున్నారా అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై మోదీ సర్కార్ నుంచి పారదర్శకతను ఆశించవచ్చా అని వ్యాఖ్యానించారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య 12 నుంచి 16 నెలల గ్యాప్ ఉండాలని వ్యాక్సినేషన్ పై జాతీయ శాస్త్రీయ సలహా మండలి (ఎన్టీఏజీఐ) గురువారం ప్రభుత్వానికి సూచించింది. అయితే మరో దేశీ కొవిడ్-19 కొవాక్సిన్ డోసుల మధ్య విరామంపై కమిటీ ఎలాంటి మార్పులు ప్రతిపాదించలేదు.