దేశంలో ఎక్కడాలేని విధంగా పూర్తి కృష్ణశిలలతో నిర్మితమవుతున్న యాదాద్రిలక్ష్మీనరసింహుడి దివ్య క్షేత్రం హరితశోభను సంతరించుకున్నది. యాదాద్రి కొండ చుట్టూ ఎటుచూసినా పచ్చటి పూల మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి. చుట్టూ ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు, పూలు, ఔషధ మొక్కలు, దేవతా వృక్షాలు, రాశి, నక్షత్ర వనాలతో కొండంతా పచ్చదనం పరుచుకున్నది. యాదాద్రి కొండ పూర్తిగా ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం పంచేలా నిర్మాణాలు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైటీడీఏ అధికారులు ఆలయం చుట్టూ పచ్చదనంతో నింపుతున్నారు. యాదాద్రి కొండ చుట్టూ దాదాపు 108 రకాల మొక్కలు నాటారు. హరిహరుల నక్షత్ర వృక్షాలు, సుగంధ పుష్పాల దేవతా ఉద్యానవనం, ఆధ్యాత్మిక, ఆహ్లాదాల మేళవింపు అవుతున్నది. ఉత్తర దిశగా నృసింహుడి జన్మ నక్షత్రం, స్వాతి, తులరాశికి ప్రాధాన్యం గల పొగడ మొక్కలు, ఆ తర్వాత వరుసలో ముక్కంటి పరమశివుడి మిధున రాశి ప్రకారం కదంబ మొక్కలు నాటారు. హరిహరుల జన్మ నక్షత్ర పొగడ, కదంబ వృక్షాల మొక్కలతో పాటు వాటి మధ్యలో అర్చనలకు వినియోగించే సుగంధ పుష్పాలు, పచ్చదనం వెల్లివిరిసే విధంగా ల్యాండ్ స్కేప్ గార్డెన్లను తీర్చిదిద్దుతున్నారు. ప్రధానాలయం చుట్టూ ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచేవిధంగా కొండచుట్టూ పచ్చదనాన్ని నింపుతున్నారు.
కొండ చుట్టూ 20 వేల మొక్కలు నాటగా, ఇందులో సంపెగ, మాగని, పొన్న చెట్టు, నాగవళి, విరజాజి, సన్నజాజి, నైట్ క్విన్, ఏక బిల్వం, బిల్వం, రావి, మర్రి, వేప, జువ్వి, సబూమి, మవోడియా, బిగ్నోనియా, మెగాపొటియా, ఏడియోమా, పైకస్ ఎవెన్యూ, ఎటోడిమా మొక్కలతోపాటు వివిధ రకాల పూలమొక్కలు, సుగంధ ద్రవ్యాలు వెదజల్లె మొక్కలు ఉన్నాయి.