సింగపూర్: సింగపూర్లో వాసవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్యవైశ్యులు వాసవి క్లబ్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో వర్చువల్ పద్దతిలో జూమ్ కాల్ ద్వారా వాసవి జయంతిని నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలోని సిద్ది వినాయక ఆలయ పురోహితుడు ఆంజనేయ శర్మ ఇంట్లో ప్రత్యేక అలంకరణతో అమ్మవారి మంటపాన్ని అలంకరించి భక్తులందరిచేత గణపతి పూజ, ఆదిత్యహృదయము, చంద్రశేఖరాష్టకం, వాసవి కుంకుమార్చన, అమ్మవారి జన్మవృత్తాంతముతో కూడిన చక్కని వర్ణనతో ఆహుతులను భక్తి శ్రద్దలతో వ్రతమాచరింపజేశారు.
అదే సమయంలో సింగపూర్లో శ్రీ మారియమ్మన్ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మహిళలు, పిల్లలు అమ్మవారి మణిదీప వర్ణన, అమ్మవారి భక్తిగీతాలాపనలతో కార్యక్రమాన్ని రంజింపజేశారు.
కార్యక్రమానికి అతిథిగా హాజరైన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షుడు, ప్రస్తుత పెనుగొండ వాసవి నిత్యాన్నదాన ట్రస్ట్ ప్రెసిడెంట్ అయిన నూలి వెంకట రమణ మూర్తి సభ్యులందరికి అమ్మవారు చెప్పిన ధర్మ సూత్రాలను వివరించారు.
కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గొట్లూరు, క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి, కమిటీ సభ్యులు కిషోర్ ముక్కా, ముకేశ్ భూపతి, మురళి కృష్ణ పబ్బతి, రాజా విశ్వనాథుల తదితరులు పాల్గొన్నారు.