హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగనున్న ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా నేపథ్యంలో నిబంధనలను అనుసరించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి చెప్పారు. బుధవారం ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలు, పలు పట్టణాల్లోని వార్డులకు శుక్రవారం జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. మొత్తం 1,539 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతుందని, 9,809 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఇందులో 676 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని వెల్లడించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ప్రతి పోలింగ్ కేంద్రంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,307 మంది అభ్యర్థులో పోటీలో ఉన్నారని, 11,34,032 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన 2500 బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. సిద్దిపేటకు 447, గ్రేటర్ వరంగల్ 1,021, ఖమ్మం 758, జడ్చర్ల 108, నకిరేకల్ 40, అచ్చంపేట 80, కొత్తూరు 24, నల్లగొండ 6, గజ్వేల్6, పరకాల 4, బోధన్ 6 బ్యాలెట్ బాక్స్లు సిద్ధం చేశామని తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు 872 పోలింగ్ స్టేషన్లలో లైవ్ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
కొవిడ్ నియంత్రణకు చర్యలు
ఎన్నికలు జరిగే అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలుచేస్తున్నట్టు పార్థసారథి తెలిపారు. ఎన్నికల సిబ్బందికి మొత్తం 28,810 ఫేస్ మాస్కులు, 14,505 ఫేస్ షీల్డులు, 22,910 గ్లౌజ్లు, 18,455 హ్యాండ్ శానిటైజర్లు, 4,895 శానిటైజర్ బాటిళ్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు. మున్సిపాలిటీల్లోని 2,733 వార్డులు, 7,880 బహిరంగ ప్రదేశాలను శానిటైజ్ చేశామని వివరించారు. అందరూ తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని ఆదేశాలు జారీచేశామని పేర్కొన్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు
ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు రూ.3,65,750 నగదు సీజ్ చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. రూ.1,25,307 విలువ కలిగిన 479.37 లీటర్ల మద్యం సీజ్ చేశామని వెల్లడించింది. 37 ఫిర్యాదులు వచ్చాయని, 67 ఎఫ్ఐఆర్లు నమోదుచేసినట్టు వివరించింది. 579 బ్యానర్లు, 48 ఫ్లెక్సీలు, 376 పార్టీ జెండాలు, 1336 పోస్టర్లు, 34 గోడ రాతలను తొలగించామని పేర్కొన్నది.
విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: ఎస్ఈసీ
మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విజయోత్సవ ర్యాలీలను నిషేధించినట్టు తెలిపింది. గెలిచిన అభ్యర్థి ధ్రువీకరణ పత్రం తీసుకోవడానికి రిటర్నింగ్ అధికారి వద్దకు కేవలం ఇద్దరికే అనుమతించింది. నిబంధనలు అతిక్రమిస్తే తీవ్రంగా పరిగణించి విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
పోలింగ్ సిబ్బందికి కొవిడ్ రక్షణ చర్యలు
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు శుక్రవారం జరిగే పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది కరోనా వైరస్ బారిన పడకుండా అన్ని రక్షణ చర్యలు తీసుకున్నట్టు రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ చెప్పారు. సిబ్బందికి మాస్క్లు, ఫేస్షీల్డ్, గ్లోవ్స్, శానిటైజర్లు సరఫరాచేశామని తెలిపారు. బ్యాలెట్ బాక్సులన్నింటిని శానిటైజ్ చేశామని వెల్లడించారు. పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు ఒకరికొకరు ఆరు ఫీట్ల దూరంలో లైన్లలో నిలబడేలా సర్కిల్స్ గీసినట్టు బుధవారం ఆయన ట్వీట్ చేశారు.