రోడ్డు అభివృద్ధికి రూ. 3.81 కోట్లు మంజూరు
పలు గ్రామాల ప్రజలకు తగ్గిన దూరభారం
దుంపలపల్లిలో సంబురాలు
దుబ్బాక టౌన్, మే 9: ఎట్టకేలకు దుబ్బాక మున్సిపల్ పరిధలోని దుంపలపల్లి – మిరుదొడ్డి మండలం ధర్మారం (మెదక్ పీడబ్ల్యూడీ) మధ్య రోడ్డుకు మోక్షం లభించింది. పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రయాణానికి తీవ్ర ఇబ్బందిగా మారగా, రోడ్డును బాగు చేయాలని ఎన్నో ఏండ్లుగా మొరపెట్టుకున్నా ఫలితం లేకపోగా టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే చివరకు సాధ్యపడింది. మెదక్ పీడబ్ల్యూడీ ప్రధాన రహదారి నుంచి దుంపలపల్లి మీదుగా బల్వంతాపూర్ గ్రామాలకు అనుసంధానమయ్యే 7.10 కిలోమీటర్ల రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దేందుకు పీఎంజీఎస్వై పథకం కింద రూ.3.81 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నో ఏండ్లుగా తాము పడుతున్న ఇబ్బందులను గ్రహించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి నేడు నిధులను మంజూరు చేయడంతో దుంపలపల్లిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు సంబురాలు జరుపుకొన్నారు.
తీరనున్న 18 ఏండ్ల నరకయాతన
దుంపలపల్లి – ధర్మారం గ్రామాల మధ్య ఉన్న రోడ్డు 18 ఏండ్లుగా దెబ్బతిని ప్రయాణం నరకయాతనగా మారింది. రోడ్డంతా గుంతలు గుంతలు మారి కంకర తేలి ఉండటంతో వాహనాలు చెడిపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో కొద్దిపాటి మరమ్మతులు చేసినప్పటికీ వర్షాకాలం రోడ్డు దెబ్బతిని తిరిగి అధ్వానంగా మారింది.
చాలా సంతోషంగా ఉంది
ఎన్నో ఏండ్లుగా తాము పడ్డ ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. నేను సర్పంచ్గా పని చేసినప్పటి నుంచి రోడ్డు బాగు కోసం పలుమార్లు విన్నవించాం. చిన్నపాటి మరమ్మతులు చేసి వదిలేశారు. ఈ రోడ్డును పూర్తి స్థాయిలో బాగు చేయాలని మంత్రి హరీశ్రావును, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిని వేడుకున్నా. త్వరలోనే రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు నిధులు మంజూరు చేశారు. త్వరలోనే రోడ్డు బాగుపడి చాలా గ్రామాల ప్రజలు సుఖమైన ప్రయాణం చేయనున్నారు. రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-అధికం సుగుణ బాలకిషన్గౌడ్, మున్సిపల్ వైస్చైర్పర్సన్