ఖమ్మం : మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన టీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. పరిహారం అందజేసి ఆదుకుంది. నిరుడు అక్టోబర్ నెలలో పూర్వ ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన భీమేశ్వరరావును మావోయిస్టులు హతమార్చిన విషయం విదితమే. అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆధ్యర్యంలో అతడి కుటుంబాన్ని అక్కున చేర్చుకుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గురువారం హైదరాబాద్లో టీఆర్ఎస్ తరఫున రూ.5 లక్షలు, ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా అందజేశారు. భీమేశ్వరరావు కుమారుడు సాయికిరణ్కు ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. భీమేశ్వరరావు చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్గా, అలుబాక టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా పనిచేశారు. అతడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పార్టీ నిర్మాణం, బలోపేతం కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ శ్రేణులను గుండెల్లో పెట్టుకుంటామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
అందుకే పార్టీ సభ్యత్వం కలిగిన క్యాడర్కు రూ.2 లక్షల బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామని వివరించారు. అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తరఫున టీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి బాసటగా నిలిచిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్మే సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.