న్యూఢిల్లీ, జూన్ 11: కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. కేంద్రం సమాయత్తమవుతున్నది. లక్షమంది సుశిక్షితులైన ఆరోగ్య సిబ్బందిని (హెల్త్ఆర్మీని) సిద్ధంగా ఉంచటానికి ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖ ఈ మేరకు కసరత్తు చేపట్టిందని సంబంధిత అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. దీంట్లోభాగంగా దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లోని 194 జిల్లాల పరిధిలో ఉన్న 300 శిక్షణ కేంద్రాలను ఇప్పటికే గుర్తించామన్నారు. కొత్తవారిని తీర్చిదిద్దటమేగాక ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆరోగ్యసిబ్బంది నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు.
ఆరు రంగాల్లో శిక్షణ
శిక్షణ ఇవ్వటానికి ఆరు రంగాలను గుర్తించారు. అవి.. ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, శాంపిల్ కలెక్షన్, హోం కేర్ సపోర్ట్, అడ్వాన్స్ కేర్ సపోర్ట్, మెడికల్ ఎక్వీప్మెంట్ సపోర్ట్. వీటిల్లో మూడు నెలలపాటు శిక్షణ ఉంటుంది.
ఐటీఐ పూర్తిచేసిన వారికి..
పలు రాష్ట్రాల్లో తగిన ఆరోగ్య సిబ్బంది లేకపోవటంతో ఆక్సిజన్ వెంటిలేటర్లు, కాన్సన్ట్రేటర్లు వంటి వైద్యపరికరాలు ఉన్నా కూడా వాటిని వినియోగించుకోలేకపోతున్నామని ఫిర్యాదులు వస్తుండటంతో.. వైద్యపరికరాల నిర్వహణపై కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ఈ మేరకు 500 జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద పని చేయటానికి వీలుగా 20 వేల మంది ఐటీఐ పూర్తి చేసినవారిని అధికారులు ఇప్పటికే గుర్తించారు. వీరికి పూర్తిస్థాయిలో శిక్షణనివ్వనున్నారు.
ఇప్పటికే 2.25 లక్షల మందికి శిక్షణ
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఇప్పటికే కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ 2,25,000 మందికి ఆరోగ్యకార్యకర్తలుగా పని చేయటానికి వీలైన సమగ్రమైన శిక్షణనిచ్చింది. ప్రస్తుతం మరో లక్ష మందిని సిద్ధం చేయనుంది. వీరు ప్రభుత్వ దవాఖానల్లో, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దవాఖానల్లోనేగాక పేషంట్లకు వారి ఇండ్లలోనే ఆరోగ్య సేవలు అందించటంలో శిక్షణ పొందుతారు. అంతేకాదు, కరోనా బారిన పడి మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించటంలో కూడా వీరికి శిక్షణ లభిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.