బీజింగ్: చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాకు చెందిన ఆంట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సిమోన్ హు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ జింగ్ బాధ్యతలు స్వీకరిస్తారని ఆంట్ గ్రూప్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
సీఈవో పదవికి రాజీనామా చేసేందుకు అనుమతించాలన్న సిమోన్ హు విజ్ఞప్తిని ఆమోదిస్తున్నట్లు ఆంట్ గ్రూప్ పేర్కొంది. వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు ఆంట్ బోర్డుకు సిమోన్ హు విజ్ఞప్తి చేశారు. సంస్థను అభివ్రుద్ధి చేయడానికి సిమోన్ హు క్రుషిని అభినందించింది బోర్డు.
ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ అనుబంధ ఫిన్ టెక్ సంస్థ ఆంట్ నుంచి వైదొలిగిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల్లో సిమోన్ హు రెండోవారు. 2019లో సంస్థ సీఈవోగా సిమోన్ హు బాధ్యతలు చేపట్టారు. గతేడాది అక్టోబర్లో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా ప్రభుత్వ నియంత్రణల తీరును వ్యతిరేకించారు. దీనిపై చైనా ప్రభుత్వం ఆగ్రహించింది. దీంతో ఆంట్ గ్రూప్తోపాటు ఆలీబాబా పనితీరుపై చైనా అధికారులు నిఘా పెట్టారు.