టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ శశాంక
అధికారులతో సమీక్ష
కార్పొరేషన్, మే 25: లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లి వచ్చేందుకు వీలుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఆయన సీపీ కమలాసన్రెడ్డితో కలిసి జిల్లా అధికారులతో లాక్డౌన్ అమలు, ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్పై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగులంతా కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు ఉదయం 10 గంటల్లోపే తెచ్చుకోవాలన్నారు. గుర్తింపు కార్డులతో కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. మొదటి డోస్ తీసుకున్న ఉద్యోగులంతా డ్యూ తేదీ ప్రకారం రెండో డోస్ టీకా తీసుకోవాలని సూచించారు. కొందరు ఉద్యోగులు హోం ఐసొలేషన్లో ఉంటున్నారని, సంబంధిత శాఖల జిల్లా అధికారులు వారితో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకొని మనోధైర్యం కల్పించాలన్నారు.
ఆరోగ్యం క్షీణిస్తే వెంటనే దవాఖానలో చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యాలయాలకు ప్రభుత్వ ఉద్యోగులు రోజుకు 33 శాతం మాత్రమే హాజరు కావాలని, అత్యవసర సేవలందించే శాఖల సిబ్బంది అందరూ హాజరుకావాలని సూచించారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. సీపీ కమలాసన్రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు కార్డులు వెంట ఉంచుకోవాలని సూచించారు. కార్యాలయాల పనివేళల్లో ఉద్యోగులు బయటకు రావద్దని సూచించారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నామని, ఎరువుల రవాణా వాహనాలు, హమాలీలకు అధికారుల కోరిక మేరకు అనుమతి ఇస్తున్నామన్నారు. అత్యవసర మందులు అందించే ఫార్మసిస్టులు తమ ఐడీ కార్డులు, వాహన పాసులను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువేరియా, జిల్లా మారెటింగ్ అధికారి పద్మావతి, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ పాల్గొన్నారు.
మారెట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వాలి
జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ప్రతిపాదించిన స్థలాల్లో శాఖాహార, మాంసాహార సమీకృత మారెట్ల నిర్మాణానికి సమగ్ర అంచనాలు ఇవ్వాలని కలెక్టర్ శశాంక ప్రజారోగ్యశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన హుజూరాబాద్ ప్రజారోగ్య ఈఈ, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపల్ కమిషనర్లతో శాఖాహార, మాంసాహార మారెట్లు, వైకుంఠధామాల నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మారెట్ల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాలను పరిశీలించి సమగ్ర బడ్జెట్ అంచనాలు తయారు చేసి ఇవ్వాలన్నారు. మారెట్లలో టాయ్లెట్, ప్రజలు వేచి ఉండేందుకు స్థలం, ప్రవేశ ద్వారం వద్ద గేట్, క్రమ పద్ధతిలో కొనుగోలు చేసేందుకు వీలుగా మారెట్లను నిర్మించాలన్నారు. హుజూరాబాద్లో ఎస్సారెస్పీ స్థలంలో సమీకృత మార్కెట్ నిర్మించాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో వైకుంఠధామాలు, ముస్లిం, మైనార్టీల గ్రేవ్ యార్డ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారు చేసి పంపాలన్నారు. సమావేశంలో ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వసంతరావు, మున్సిపల్ కమిషనర్లు ప్రసన్నరాణి, రషీద్, అంజయ్య, వేణుమాధవ్, తదితరులు పాల్గొన్నారు.