రియో: బ్రెజిల్లో కరోనా విలయ తాండవం చేస్తున్నది. ఇంకా ఆ దేశంలో కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఆ దేశంలో 4195 మందికిపైగా మరణించారు. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్లు బ్రెజిల్లో భీకర రూపం దాల్చాయి. అన్ని నగరాల్లోనూ హాస్పిటళ్లు రోగులతో కిక్కిరిసిపోయాయి. చికిత్స కోసం కరోనా బాధితులు హాస్పిటళ్లలో పడిగాపులు కాస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు నిర్జీవావస్తకు చేరుకున్నాయి. కరోనా వైరస్ వల్ల బ్రెజిల్లో మృతిచెందిన వారి సంఖ్య 3,37000కు చేరుకున్నది. అమెరికా తర్వాత అత్యధిక మరణాలు సంభవించింది బ్రెజిల్లోనే. అయితే మహమ్మారిని అదుపు చేసేందుకు అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో మాత్రం లాక్డౌన్ అమలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వైరస్ నష్టం కన్నా.. లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని ఆయన వాదిస్తున్నారు.
ఇప్పటి వరకు బ్రెజిల్లో కోటి 30 లక్షల మందికి కరోనా వైరస్ సంక్రమించింది. ఈ ఏడాది మార్చిలోనే ఆ దేశంలో వైరస్ వల్ల 66570 మంది మరణించారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ పేషెంట్లు.. 90 శాతం వరకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ను వాడుతున్నారు. అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఇప్పటి వరకు కేవలం 8 శాతం మందికి మాత్రమే తొలి డోసు టీకా అందినట్లు తెలుస్తోంది. కనీసం 20 రోజుల పాటు కఠిన లాక్డౌన్ అమలు చేస్తేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. బ్రెజిల్ వేరియంట్ కేసులు దేశంలో కొత్తగా 92 నమోదు అయ్యాయని, ఆ కొత్త స్ట్రెయిన్ వల్లే దేశంలో కరోనా ఉదృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు అంచనా వేస్తున్నారు.