సంగారెడ్డి, జూన్ 10 : ఉద్యాన పంటలైన పండ్ల తోటలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటికి అంటు, నారు మొక్కలతో సాగుచేసే నర్సరీలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఉద్యానశాఖ అధికారి సునీత తెలిపారు. లైసెన్స్ లేకుండా నర్సరీలు నడిపితే రూ. 50 వేల జరిమానాతో పాటు జైలుశిక్ష విధించనున్నట్లు చెప్పారు. నర్సరీల యజమానులు ఏటా లైసెన్స్లు రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. క్రయవిక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో మొక్కలు, నారులు, పూల మొక్కలు పెంచుతున్న నర్సరీలు 65 ఉన్నాయని, 21 మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసుకున్నాయన్నారు. మిగతా నర్సరీల యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అన్నదాతలు పంటల సాగుకు అధిక మొత్తంలో పెట్టుబడి పెడతారని, జన్యుపరమైన స్వచ్ఛత, నాణ్యత కలిగి ఉండాలని, కల్తీనారుతో రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. రైతులు ఉద్యానశాఖ నుంచి రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయించుకున్న నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ లేని నర్సరీల నుంచి రైతులు మొక్కలు కొనుగోలు చేసి నష్టపోతే ఉద్యానశాఖకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
లైసెన్స్కు కావాల్సిన పత్రాలు..
దరఖాస్తుదారుడి చిరునామా (టెలిఫోన్, కరెంట్ బిల్లు, ఓటరు, ఆధార్ కార్డు ఉండాలి.)
నర్సరీ చిరునామా ఫొటోతో సహా ఉండాలి.
భూమి పట్టదారు పాసుపుస్తకం జిరాక్స్-లీజుడాక్యుమెంట్ పత్రాలు.
నర్సరీ లేఅవుట్, మ్యాప్-ప్రభుత్వ ఆమోదిత సర్వేయర్ లేదా ఏజెన్సీతో పొంది ఉండాలి.
నర్సరీలో మౌలిక సదుపాయాల పూర్తి వివరాలు ఉండాలి.
మూడు సంవత్సరాల ఉత్పత్తి వివరాలు తెలుపాలి.
నర్సరీ డిజిటల్ ఫొటో కాఫీ పొందుపర్చాలి.
చలానా నకలు రసీదు జత చేయాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు వివరాలు..
నర్సరీల రిజిస్ట్రేషన్కు సంబంధిత జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ అధికారిని సంప్రదించాలి.
పండ్ల మొక్కల ఉత్పత్తికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.5వేలు.
కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధద్రవ్యాల నర్సరీ రిజిస్ట్రేషన్ ఫీజు 2-4 లక్షలఉత్పత్తి వరకు రూ.వెయ్యి, 4 లక్షలకు మించి ఉత్పత్తికి రూ.2500 చెల్లించాలి.
లైసెన్స్ రెన్యువల్-రిజిస్ట్రేషన్ల తర్వాత…
పండ్ల మొక్కలకు మూడేండ్లకోసారి రూ.1500 కట్టి లైసెన్స్ రెన్యువల్చేయించుకోవాలి.
కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధద్రవ్యాల మొక్కలకు ఏటా 4లక్షల కన్నా తక్కువైతే రూ.500, 4లక్షల కన్నా ఎక్కువైతే రూ.వెయ్యి కట్టి లైసెన్స్ రెన్యువల్చేసుకోవాలి.
నర్సరీలు ఉద్యానశాఖలో నమోదై ఉండాలి
జిల్లాలో మొక్కలు పెంచుతున్న నర్సరీలు ఉద్యానశాఖలో నమోదై ఉండాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.ప్రస్తుతం ఉద్యానశాఖ నుంచి టమాట నారు రాయితీలో పొందడానికి సీవోఈ జీడిమెట్లలో అం దుబాటులో ఉంది. నారు కావాల్సిన రైతులు ఎకరానికి రూ.1500, DD-ADH, COE JEEDIMETLA పేరున డీడీ కట్టి, ఉద్యానశాఖలో దరఖాస్తు చేసుకోవాలి.
-సునీత, ఉద్యానశాఖ అధికారి, సంగారెడ్డి జిల్లా