మెదక్/ తూప్రాన్ రూరల్, మే 21: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను బలోపేతం చేస్తూ బాలింతలకు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ప్రతి రోజు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలకు కేంద్రంలోనే గుడ్లు, పప్పులు, బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు. అంతేకాకుండా చిన్నారులు కూడా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు కేంద్రానికి రాలేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లను ఇంటింటికీ తిరుగుతూ బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించాలని నిర్ణయించింది. దీంతో మెదక్ జిల్లాలోని 1076 అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు బాలింతలు, గర్భిణులు ఇంటికి వెళ్లి వారికి నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.
మెదక్ జిల్లాలో 7వేల మంది బాలింతలు… 6487 మంది గర్భిణులు..
మెదక్ జిల్లాలో నాలుగు ప్రాజెక్టు పరిధిలో 1076 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 885 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు కాగా, 191 మినీ అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. మొత్తం 1076 అంగన్వాడీ కేంద్రాల్లో 1034 మంది అంగన్వాడీ టీచర్లు పని చేస్తున్నారు. మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో 34 ఖాళీలు ఉండగా, మినీ అంగన్వాడీలో 8 ఖాళీలు ఉన్నాయి. ఇదిలావుండగా బాలింతలు 7వేల మంది, గర్భిణులు 6487 మంది ఉన్నారు. ఇకపోతే చిన్నారులు ఏడు నెలల నుంచి సంవత్సరం పిల్లలు 6145, ఏడాది నుంచి మూడేళ్ల వయస్సు పిల్లలు 24030 మంది, మూడు సంవత్సరాల నుంచి ఆరేళ్ల పిల్లలు 23144 మంది ఉన్నారు. వీరందరికీ అంగన్వాడీ కేంద్రం నుంచి నిత్యావసర సరుకులతో పాటు పౌష్టికాహారం అందుతోంది.
శానిటైజ్ చేస్తూ… నిత్యావసర వస్తువులు అందజేస్తూ…
కరోనా వైరస్ కారణంగా అంగన్వాడీ టీచర్లు కేంద్రం పరిధిలోని బాలింతలకు, గర్భిణుల ఇండ్లకు వెళ్లి వారికి ముందుకు శానిటైజ్ చేస్తూ గుడ్లు, బియ్యం, పప్పు, నూనె, పాలు పంపిణీ చేస్తున్నారు. ఆ తర్వాత బాలింతలు, గర్భిణులకు రిజిస్ట్రార్లో సంతకాలు తీసుకుంటున్నారు. అంగన్వాడీ టీచర్లు పకడ్భందీగా నూతన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన కల్పించారు. కరోనా నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ భౌతిక దూరం పాటిస్తూ సరుకులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆదర్శంగా నిలుస్తున్న అంగన్వాడీలు..
కరోనా నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు బాలింతలు, గర్భిణులు రావద్దని, తామే ఇంటికి వద్దకు వచ్చి సరుకులను అందజేస్తామని చెబుతున్నారు. కరోనా వైరస్ కారణంగా గర్భిణులు మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి రోజు పౌష్టికాహారాన్ని తీసుకునేలా చూస్తున్నారు. ఇకపోతే బాలింతలకు కూడా గుడ్లు, బియ్యం, పప్పు, నూనెలను సరఫరా చేస్తున్నారు.
జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన కల్పించాం..
కరోనా వైరస్ కారణంగా అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ తిరుగుతూ బాలింతలు, గర్భిణులకు గుడ్లు, బియ్యం, నూనె, పప్పు, పాలు పంపిణీ చేస్తున్నారు. ఇంటికి వెళ్లిన వెంటనే శానిటైజ్ చేస్తున్నారు. ఆ తర్వాత సరుకులను అందజేస్తున్నారు. 7 నెలల నుంచి మూడేళ్ల చిన్నారులకు బాలామృతం, 16 గుడ్లను సరఫరా చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు బాలింతలు, గర్భిణులను రానివ్వకుండా ఇంటికే వెళ్లి సరుకులను అందిస్తున్నారు.