కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. మే 12వ తేదీ నుంచి జూన్ 19వ తేదీ వరకు 38 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. ఇంటింటి జ్వర సర్వే, వ్యాక్సినేషన్ అందించింది. టెస్టులను పెంచడంతోపాటు పాజిటివ్ వచ్చిన వారిని హోం ఐసొలేషన్లో ఉంచి మెడికల్ కిట్లను అందజేసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని దవాఖానలకు తరలించి మెరుగైన వైద్యం అందించింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పోలీసు, వైద్యారోగ్య శాఖల నివేదికలతోపాటు మంత్రుల అభిప్రాయం మేరకు రాష్ట్ర సర్కార్ లాక్డౌన్ను ఎత్తివేసింది. నేటి నుంచి దుకాణాలు, సినిమా హాళ్లు, షాపింగ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరచుకోనున్నాయి. యథావిధిగా ఆర్టీసీ బస్సు సర్వీసులు సేవలను అందించనుండగా, జూలై 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. లాక్డౌన్ను ఎత్తివేసినా ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వికారాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కేసులు తగ్గడంతో లాక్డౌన్ ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. జిల్లాలో నేటి నుంచి అన్ని రకాల దుకాణాలు, సినిమా హాళ్లు, షాపింగ్మాల్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరచుకోనున్నాయి. ఆర్టీసీ బస్సులు యధాతథంగా ప్రారంభం కానున్నాయి. జూలై 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్లు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. మే 12 నుంచి జూన్ 19 వరకు 38 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగింది. నేటి నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్నీ ఫ్రీగా ఉండనున్నాయి.
వికారాబాద్ జిల్లాలో..
జిల్లాలో ప్రతీ రోజు 2వేల మంది కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇందులో రెండు అంకెల కేసులు కూడా దాటడంలేదు. కొన్ని పీహెచ్సీల్లో జీరో పాజిటివీటి నమోదవుతున్నది. ప్రతి రోజు 4వేల మందికి వ్యాక్సినేషన్ వేస్తున్నారు. ఇక నేటి నుంచి వికారాబాద్ జిల్లాలోని మూడు(తాండూరు, పరిగి, వికారాబాద్) డిపోల నుంచి 118 బస్సులు.. 46వేల కిలోమీటర్లు రాకపోకలు సాగించానున్నాయి. జూలై 1వ తేదీ నుంచి 998 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
పోలీసు శాఖ, వైద్యారోగ్య శాఖ నివేదిక
పోలీసు శాఖ, వైద్యారోగ్య శాఖ నుంచి సీఎం కేసీఆర్ నివేదిక తెప్పించుకున్న తర్వాత మంత్రుల అభిప్రాయం తీసుకుని లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటన జారీచేశారు. ప్రస్తుతం కేసులు తగ్గడంతో అన్ని కార్యకలాపాలకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఆంక్షలు లేకుండా ప్రతిఒక్కరూ బయటకు వెళ్లొచ్చు. కానీ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీచేశారు.
థియేటర్లు ఓపెన్..
ఆదివారం నుంచి సినిమా థియేటర్లు కూడా తెరచుకోనున్నాయి. లాక్డౌన్ వల్ల సినిమా హాళ్లు మూసివేశారు. కేసులు తగ్గడంతో థియేటర్లు తెరిచేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. దీంతో సినీ పరిశ్రమకు ప్లస్ కానున్నది. కరోనా వల్ల.. చిన్నా, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
జూలై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం
అన్నీ కేటగిరీల విద్యా సంస్థలు, పూర్తి స్థాయిలో సన్నద్ధతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్, విద్యాశాఖను ఆదేశించింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ఉద్దేశంతో కేబినేట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం అందించాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లాలో 732 ప్రాథమిక, 113 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో 153 ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి. జూలై 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండడంతో ఇందుకు సంబంధిచిన ఏర్పాట్లు చేస్తున్నారు.
118 బస్సులు.. 46వేల కిలోమీటర్లు.
కొవిడ్ నేపథ్యంలో డిపోలకు పరిమితమైన సగం ఆర్టీసీ బస్సులు నేటి నుంచి పూర్తిస్థాయిలో రోడ్డెక్కనున్నాయి. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి మూడు డిపోల పరిధిలో 254 బస్సులు ఉన్నాయి. ఇందులో ఆర్టీసీ బస్సులు 118 ఉండగా, అద్దె బస్సులు 136 ఉన్నాయి. 1096 మంది ఉద్యోగులు ఉండగా.. ప్రతి రోజు ఈ బస్సులు 96 వేల కిలోమీటర్లు రాకపోకలు సాగించి రూ.22లక్షల నుంచి 25 లక్షల వరకు ఆదాయం తీసుకొస్తుండేవి. ప్రస్తుతం కొవిడ్ కాలంలో ప్రతిరోజు రూ.7నుంచి 8 లక్షల కంటే ఆదాయం దాటడంలేదు. లాక్ డౌన్ ఎత్తివేయడంతో జిల్లాలోని తాండూరులో 46, వికారాబాద్ 30, పరిగి 42 చొప్పున మూడు డిపోల పరిధి నుంచి 118 బస్సులు రోడ్డెక్కుతాయి. 46వేల కిలోమీటర్లు రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ 38 రోజుల్లో దాదాపుగా రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
రంగారెడ్డి జిల్లాలో…
షాబాద్, జూన్ 19: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కరోనా సెకండ్ వేవ్లో కేసులు సంఖ్య అత్యధికంగా ఉడడంతో మే 12 నుంచి లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో రంగారెడ్డిజిల్లాలో నేటి నుంచి అన్ని రకాల కార్యకలాపాలు యథతథంగా నడువనున్నాయి. జూలై 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ తరగతులు కొనసాగిస్తూ.. విద్యాశాఖ తదితర విధి విధానాలను విడుదల చేయనున్నది. వానకాలం సీజన్ కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పని చేయనున్నాయి. లాక్డౌన్ ఎత్తివేతతో దినసరి కూలీలు, వ్యాపారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేశారని ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని, తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది.