ఎదులాపురం, మే 13: బోథ్ ప్రభుత్వ దవాఖానలో ఈ నెల 7న జరిగిన ఘటనకు కారకులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎంపీహెచ్ఈ-జేఏసీ) జిల్లా చైర్మన్ డాక్టర్ మెట్టపెల్లివార్ శ్రీధర్ కోరారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యులు కొవిడ్ సమయంలో ఇబ్బందులు పడుతూ ప్రజలకు సేవలు అందిస్తున్నారని, ఇలాంటి సమయంలో కొంతమంది కావాలని మెడికల్ ఆఫీసర్పై అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ ఘటనపై తెలంగాణ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ రాజ్, ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్రకు ఫిర్యాదు చేశామన్నారు. దోషులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో టీఎంపీహెచ్ఈ జేఏసీ కన్వీనర్ బండారి కృష్ణ, కో చైర్మన్ డాక్టర్ ఎన్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.