వైఖరి తెలుపాలని కేంద్రానికి జస్టిస్ బోబ్డే లేఖ
న్యూఢిల్లీ, మార్చి 31: తనను తాను స్వలింగ సంపర్కుడి (గే)గా ప్రకటించుకున్న సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించే అంశంపై వైఖరి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే లేఖ రాశారు. నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కోరారు. కిర్పాల్ను హైకోర్టు జడ్జిగా నియమించాలని 2017లోనే ఢిల్లీ హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
అయితే దీనిపై ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలుపాలని మార్చి మధ్యలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి జస్టిస్ బోబ్డే లేఖ రాసినట్టు సమాచారం. మార్చి 2న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం.. కిర్పాల్ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. అయితే కేంద్రం నుంచి మరింత సమాచారం కోరాలని నిర్ణయిస్తూ ఆయన నియామకాన్ని వాయిదా వేసింది. ఇలా వాయిదా పడటం ఇది నాలుగోసారి. కిర్పాల్ స్వలింగ సంపర్కుడు. ఆయన జీవితభాగస్వామి విదేశీయుడు. అతడి వల్ల భద్రతా సమస్యలు తలెత్తవచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చింది. అయితే, కిర్పాల్ గే కావడం వల్లనే ఆయన నియామకంపై కేంద్రం జాప్యం చేస్తుందన్న ఆరోపణలున్నాయి. స్వలింగసంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
పాన్-ఆధార్ అనుసంధానం గడువు 3 నెలలు పొడిగింపు