బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. ఆమెను మనీ లాండరింగ్ దోపిడీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి విచారణకు పిలిచింది. సెప్టెంబర్ 25న శనివారం నాడు ఫైనాన్షియల్ ప్రోబ్ ఏజెన్సీ ఢిల్లీ యూనిట్ ముందు హాజరు కావాలని అధికారులు నటిని కోరారు. అందుకు జాక్వెలిన్ కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. ఆమె తనపై వస్తున్న ఆరోపణలు అబద్దమని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తోంది.
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కు సంబంధించిన విచారణకు జాక్వెలిన్ ను అధికారులు పిలిచారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె సూత్రధారిగా కాకుండా బాధితురాలిగా ఈడీ ముందు హాజరు అవుతుందని కొందరు చెబుతున్నారు. రూ. 200 కోట్ల స్కాంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి సూత్రధారి అని తేలింది. జాక్వెలిన్ తో అతడి గర్ల్ ఫ్రెండ్ పరిచయాన్ని పెంచుకొని ఈమెను స్కాంలోకి లాగారని తెలుస్తోంది. వారి మాయలో పడి జాక్వెలిన్ మోసపోయారని తెలిసింది.
2017ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన లంచం కేసులో అరెస్ట్ అయిన చంద్రశేఖర్ని విచారించగా చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. అందులో జాక్వెలిన్ పేరు కూడా ఉంది. తీహార్ జైలు లోపల నుంచే దాదాపు 200 కోట్ల విలువైన దోపిడీ రాకెట్ నడుపుతున్నట్టు సదురు వ్యక్తిపై ఆరోపణలున్నాయి. అయితే నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఈడీ అధికారులు ఇదివరకే ప్రశ్నించగా.. మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.