తిరుపతి, మే 23: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు.
సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య మిథున లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముందుగా ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.
కాగా ప్రతి రోజు ఉదయం 8 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి,ఏఈవో దుర్గరాజు, సూపరింటెండెంట్ సాతేనాయక్, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగరాజు,ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.