న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ తీవ్ర ఆందోళన రేపుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 25 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం నుంచి ఆదివారం వరకు 25,462 కరోనా కేసులు, 161 మరణాలు రిపోర్ట్ అయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,53,460కు, మరణాల సంఖ్య 12,121కు పెరిగింది.
మరోవైపు ఢిల్లీలో గత 24 గంటల్లో 20,159 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 7,66,398కు చేరింది. ప్రస్తుతం 74,941 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా పాజిటివిటి రేటు 29.74 శాతం, మరణాల రేటు 1.42 శాతమని పేర్కొంది.
కాగా, ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో పడకల కొరత ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో కామన్వెల్త్గేమ్స్ గ్రామంలో కరోనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం దీనిని సందర్శించారు. యమునా స్పొర్ట్స్ కంపెక్స్లో 800 ఆక్సిజన్ బెడ్లు, ఇతర చోట్ల మరో 500 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం నాటికి అదనంగా 1400-2000 బెడ్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.