గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ ఒకరు మృతి
పట్టణంలో కొనసాగుతున్న జ్వర సర్వే
రామాయంపేట, మే 26 : మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం రాంనగర్ కాలనీకి చెందిన ఎర్రోళ్ల రవీందర్గౌడ్(45) బ్లాక్ ఫంగస్తో మంగళవారం రాత్రి హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లే.. రవీందర్గౌడ్(45)కు 17 రోజుల క్రితం కరోనా పాజిటివ్ తేలడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొంది.. కోలుకొని మంగళవారం ఉదయం ఇంటికి వచ్చాడు. ఆరోగ్యంగా ఉన్న అతడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఉన్నట్టుండి మధ్యాహ్నం అతడి కన్ను ఒకటి కనిపించకపోవడంతో పాటు నిమిషాల్లోనే కన్ను ఉబ్బింది. దీంతో కుటుం బీకులు వెంటనే స్థానికంగా ఉన్న దవాఖానలో చికిత్స నిర్వహించారు. వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ తీసుకెళ్లి కిమ్స్ దవాఖానలో అడ్మిట్ చేసి చికిత్సలు నిర్వహించారు. అక్కడి వైద్యులు బ్లాక్ ఫంగస్ అటాక్ అయ్యిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కిమ్స్ వైద్యులు అక్కడి నుంచి గాంధీ దవాఖానకు రెఫర్ చేశారు. మంగళవారం రాత్రి గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ రవీందర్గౌడ్ మృతి చెందా డు. ఈ నేపథ్యంలో రామాయంపేట పట్టణంలో రెండో దశ జ్వర సర్వేను వేగంగా జరుపాలని మున్సిపల్ చైర్మన్, కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్య కార్మికులు కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి శానిటేషన్ చేస్తున్నారు. బ్లాక్ ఫంగస్తో మృతి చెందిన కుటుంబీకులను రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, వైస్ చైర్పర్సన్ విజయలక్ష్మి, నాయకులు యాదగిరి, యాదగిరి, బాలుగౌడ్ సంతాపం తెలిపారు. మృతుడు రవీందర్గౌడ్కు భార్య సుజాత, కొడుకు రోహిత్, కూతురు రుచిత ఉన్నారు. రవీందర్గౌడ్ అంత్యక్రియలను రామాయంపేటలో మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.