ఢిల్లీ,జూన్ 22:ఇండియన్ రైల్వే 20 రోజుల్లో వల్సాడ్ ఆర్ఓబీని నిర్మించి రికార్డు సృష్టించింది. పశ్చిమ సరకు రవాణా మార్గ నిర్మాణంలో భాగంగా వల్సాడ్ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని20రోజుల వ్యవధిలో భారతీయ రైల్వే అనుబంధ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిఎఫ్సిసిఐఎల్) పూర్తి చేసింది. గుజరాత్ రాష్ట్రంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఘనతను సాధించింది.
వివిధ ప్రభుత్వ సంస్థలు, పౌర యంత్రాంగం సహకారంతో డిఎఫ్సిసిఐఎల్ పశ్చిమ సరకు రవాణా మార్గంలో కీలకమైన ఆర్ఓబి నిర్మాణాన్ని పూర్తి చేసింది. ముంబై-ఢిల్లీ రహదారిపై వల్సాడ్ లో వాహనాల రద్దీ ఎక్కువ ఉంటుంది. ఆర్ఓబి నిర్మాణం కోసం 20 రోజులపాటు వాహనాలను నియంత్రించడానికి రైల్వే అధికారులు అనుమతి పొంది, నిర్ణీత వ్యవధిలో నిర్మాణ పనులను పూర్తి చేశారు. లాక్ డౌన్ తో పాటు రవాణాపై ఆంక్షలు ఉన్నప్పటికీ దాదాపు 150 మంది సీనియర్ ఇంజినీర్లు, ఇతర సిబ్బంది వీటి నిర్మాణాన్ని పూర్తి చేశారు.