ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రక్రియ
సత్ఫలితాలు ఇస్తున్న అవగాహన కార్యక్రమాలు
టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్న ప్రజలు
పీహెచ్సీల వారీగా లక్ష్యాలు n ప్రతి రోజూ 100 మందికి..
నిబంధనలు కఠినతరం చేసిన యంత్రాంగం
మాస్కులు ధరించకుంటే కేసులు.. జరిమానాలు
ఆదిలాబాద్, ఏప్రిల్ 10 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో కరోనా వ్యాక్సిన్కు స్పందన రోజు రోజుకూ పెరుగుతున్నది. టీకా ప్రారంభంలో అంతగా ఆసక్తి చూపని వారు ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. జిల్లాలో మొదట ఫ్రంట్లైన్ వారియర్స్.. తర్వాత 60 ఏళ్లు దాటిన వారికి, ఆ తర్వాత 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ ప్రభుత్వం ఉచితంగా టీకాను పంపిణీ చేస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో అధికారులు ఎక్కువ మంది టీకా తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. వైద్యశాఖ అధికారులు, సిబ్బంది పట్టణాలు, గ్రామాల్లో టీకా ఆవశ్యతకను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. టీకా సురక్షితమైనదిగా తెలియజేస్తూ కొవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు ఆధార్కార్డు తీసుకొని సర్కారు దవాఖానలకు నేరుగా వస్తే వ్యాక్సిన్ ఇస్తామని ప్రజలకు వివరించారు.
పీహెచ్సీల వారీగా లక్ష్యాలు
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా వైద్యశాఖ అధికారులు పీహెచ్సీల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో 26 దవాఖానల్లో రోజుకు ఒక్కో ఆరోగ్య కేంద్రంలో 125 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. నిర్మల్ జిల్లాలో 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజూ ఒక్కోదాంట్లో 100 మందికి, మంచిర్యాల జిల్లాలో 28 దవాఖానల్లో రోజుకు ఒక్కో ఆరోగ్య కేంద్రంలో 100 మందికి, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 18 ఆరోగ్య కేంద్రాలుండగా, ఒక్కో దవాఖానలో 100 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. రోజూ 80 శాతం టీకా పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులను ఉన్నతాధికారులు ప్రోత్సహిస్తూ టీకా తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. తమ శాఖల పరిధిలో అర్హులైన వారందరినీ దవాఖానలకు తీసుకుపోయి వ్యాక్సిన్ ఇప్పిస్తున్నారు.
అప్రమత్తతే ఆయుధం
జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తుండగా, సర్కారు వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్య లు తీసుకుంటున్నది. రెండు రోజులుగా 200కు పైగా కేసులు నమోదవుతుండగా, జిల్లా యంత్రాంగం అల ర్ట్ అయ్యింది. 45 ఏండ్లు దాటిన వారందరూ తప్పనిసరిగా టీకా తీసుకోవాలని, ముప్పురాకుండా ముం దస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నీరజ సూచిస్తున్నారు. వైద్య సిబ్బందితో పాటు పోలీస్ యంత్రాంగం కూడా సలహాలు, సూచనలు అందిస్తున్నది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, బయటికి వెళ్లినప్పుడు భౌతిక దూరం పాటించాలని వారు పేర్కొంటున్నారు. కరోనా అంటే ప్రజల్లో భయం పోవడం, మాస్కులు ధరించకపోవడం, ఇష్టారాజ్యంగా ప్రయాణాలు చేయడం, పరిశుభ్రత పాటించకపోవడం, ఫంక్షన్ల పేరిట గుంపులుగా తిరగడంవంటి వాటితో వైరస్ వ్యాప్తి చెందుతున్నదని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే బడులను బంద్ చేసి కరోనా సామాజిక వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్నది. కిరాణాలు మటన్, చికెన్ షాపులు, హోటళ్లలో మాస్కులుంటేనే సరుకులివ్వాలని బెల్లంపల్లి ఏసీపీ రహెమాన్ శనివారం అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పక మాస్కు ధరించాలని, మాస్కు ఉన్నవారినే వాహనాల్లో ఎక్కించుకోవాలని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని, 45 ఏండ్లు దాటిన వారు తప్పక టీకా వేయించుకునేలా గ్రామాల్లో చాటింపు వేయాలని ఏసీపీ సూచించారు. ఇక మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేస్తూ జరిమానాలు కూడా విధిస్తున్నారు.
పెరుగుతున్న కేసులు..
మంచిర్యాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొవిడ్ 19 ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 16,488 కేసులు నమోదయ్యాయి. కాగా, ఏప్రిల్ నెలలోనే 873 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనాతో 54 మంది మృతి చెందారు. ప్రస్తుతం 15 మంది ఐసోలేషన్లో ఉండగా, 1000కి పైగానే యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాలో రెండు ఐసొలేషన్ కేంద్రాలు, 220 బెడ్స్ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,60,000 మంది 45 ఏండ్ల పైబడిన వారుండగా, సగం మందికూడా వ్యాక్సిన్ తీసుకోలేదు. జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా టెస్టులు, పాజిటివ్ కేసుల వివరాలను పరిశీలిస్తే రోజురోజుకూ హెచ్చవుతూనే ఉన్నాయి. ఈ నెల 3న 817 మందికి పరీక్షలు చేయగా, 84 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 4న 582 మందిలో 56 మందికి, 5న 917 మందిలో 106, 6న 781 మందిలో 112 మందికి, 7న 1817 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా 180 మందికి పాజిటివ్ వచ్చింది. 8న 1930లో 219 మందికి, 9న 1838 మందికి గాను 203 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ఇవి కూడా చదవండి