ముంబై: దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన అంశాల్లో ఆర్యన్ ఖాన్ అరెస్టు కూడా ఒకటి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఈ నెల ప్రారంభంలో డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతను అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. బెయిలు కోసం అతను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆర్యన్ను విడుదల చేయడం కోసం కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే రూ.8 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
వీటిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఖండించింది. కానీ ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన ఫొటోలు ఈ కేసుపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ నెల 2వ తేదీన ఆర్యన్ అరెస్టయిన రోజున ఒక గుండు వ్యక్తి ఆర్యన్తో సెల్ఫీ దిగిన ఫొటో తెగ వైరల్ అయింది. ఆ ఫొటోలో ఉంది తమ ఆఫీసుకు సంబంధించిన వ్యక్తి కాదని ఆ తర్వాత ఎన్సీబీ వెల్లడించింది.
అతను కేపీ గోసావి అనే ఒక ప్రైవేటు ఇన్వెస్టిగేటర్ అని, కేసులో స్వతంత్ర సాక్షి అని ఆ తర్వాత తెలిసింది. తాజాగా బయటపడిన ఫొటోల్లో ఎన్సీబీ అధికారి వాంఖడేతోపాటు గోసావి, మనీష్ భానుశాలి అనే బీజేపీ కార్యకర్త కలిసి ఉన్నారు. వీరంతా కలిసి క్రూయిజ్ నౌకలో అరెస్టయిన వారిలో ఇద్దరితో ఏదో చర్చిస్తూ మరో ఫొటోలో కనిపించారు.
గోసావికి ఎన్సీబీతో అసలు ఎటువంటి సంబంధమూ లేకపోతే అతన్ని ఆఫీసులో విచ్చలవిడిగా ఎలా తిరగనిచ్చారు? కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న ఆర్యన్తో అతను సెల్ఫీలు ఎలా దిగాడు? అని మహారాష్ట్రకు చెందిన మంత్రి నవాబ్ మాలిక్ ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే బీజేపీ కార్యకర్త అయిన మనీష్ తమకు రేవ్ పార్టీ గురించి సమాచారం అందించినట్లు అధికారులు చెప్పారు. అంటే అతను సాక్షి.
కానీ క్రూయిజ్ షిప్లో అరెస్టులు చేసిన సమయంలో అర్బాజ్ మర్చంట్ను బయటకు తీసుకు వచ్చే సమయంలో అతను కూడా అధికారులతోపాటు ఉన్నాడు. ఈ ఫొటోల్లో ఉన్నది తానేనని, పార్టీకి సంబంధించిన సమాచారం ఎన్సీబీకి అందించింది తానేనని, అప్డేట్స్ కోసం అక్కడకు వెళ్లానని మనీష్ ఆ తర్వాత వివరించాడు.
అయితే ఒక సామాన్య ఇన్ఫర్మెంట్ అయిన మనీష్, కేవలం సాక్షి అయిన గోసావి ఇద్దరూ పార్టీపై జరిగిన రెయిడ్లో, ఆ తర్వాత జరిగిన అరెస్టుల్లో ఎందుకు పాలుపంచుకున్నారో ఎవరికీ తెలియదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సాక్షిగా ఎన్సీబీ పేర్కొన్న ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి ఒకానొక సందర్భంలో పెద్ద బాంబు పేల్చాడు. ఈ కేసులో గోసావి, ఎన్సీబీ అధికారి మధ్య రూ.18 కోట్ల డీల్ గురించి చర్చలు జరిగాయని, వాటిని తాను విన్నానని అతను వెల్లడించాడు.
ఈ క్రమంలో అతన్ని ‘హోస్టైల్ సాక్షి’గా ఎన్సీబీ పేర్కొంది. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే గోసావి కనిపించకుండా పోయాడు. అతని కోసం అధికారులు తీవ్రంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. తాజాగా అతను ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బయటకు వచ్చాడు.
ముంబైలో తనకు ప్రాణహాని ఉందని, అందుకే అక్కడి నుంచి పారిపోయానని చెప్పాడు. తాను పోలీసులకు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఈ ఫొటోలను చూసిన తర్వాత మహారాష్ట్ర కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ మండిపడ్డారు. అసలు ఈ కేసు మొత్తం నకిలీదేనని దుయ్యబట్టారు.
ఏజెన్సీకి సంబంధించిన ఒక అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం సుమారు 26 కేసుల్లో సమీర్ వాంఖడే రూల్స్ అనుసరించలేదని ఆరోపించారు. ఇంతకుముందు కూడా ఈ కేసుపై స్పందించిన మాలిక్.. బీజేపీతో ఎన్సీబీ కుమ్మక్కై ఈ కేసు నడుపుతోందని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.