క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
వనపర్తిలో 40 డిగ్రీలు దాటిన టెంపరేచర్
ఉదయం నుంచే వేడి గాలులు షురూ..
వేడిమితో తల్లడిల్లుతున్న ప్రజలు
చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు
వనపర్తి, మార్చి 28 : మునుపెన్నడూ లేనంతగా ఉమ్మడి జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. ప్రస్తుత వేసవిలో ప్రమాదకరస్థాయిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా చేరుకోవడడంతో ప్రజలు ఆందోళలనకు గురవుతున్నారు. బయటకు కాలుపెడితే మండుతున్న రోడ్లపై జన సంచారం కనిపించడం లేదు. ఉదయం 7 గంటల నుంచి ఎండలు ప్రారంభమై 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తున్నారు. శీతల పానీయాల వైపు పరుగులు తీస్తున్నారు. చిరు వ్యాపారులు గొడుగులను అడ్డం పెట్టుకొని తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు.
40 డిగ్రీల దాటిన ఉష్ణోగ్రత
మండుతున్న ఎండలను తాళలేక పట్టణాల్లోని ప్రజలు, వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చే ప్రజలు శీతల పానీయాలు, పండ్ల రసాలు వంటి వాటివైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రోడ్లంతా నిర్మానుష్యంగా మారడం, నిత్యం రద్దీగా ఉండే రోడ్లు సైతం ఒకేసారి ప్రజలు లేక వెలవెలబోతున్నాయి. వేసవి తాకిడితో ప్రజలు అల్లాడుతున్నారు. వివిధ పనులకు పట్టణాలకు వచ్చే వారు ఎండవేడిమికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రతకు ప్రజలు గొడుగులు, స్కార్ప్, తువాళ్లు, క్యాప్లు ధరిస్తున్నారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అత్యవసర పనులైతేనే బయటకు రావాలని, ఆరోగ్యం కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉపాధి పనులకు వెళ్లే కూలీలు త్వరగా వెళ్లి పనులు ముగించుకొని రావాలని అధికారులు కోరుతున్నారు.