వినోబాభావే ఆరంభించిన భూదానోద్యమంలో ప్రథమ భూదాతగా చరిత్రకెక్కారు పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి. ఆయన అందించిన స్ఫూర్తితో భూదానోద్యమం మహాయజ్ఞంలా సాగింది. ఘన చరిత్ర కలిగిన భూదాన్ పోచంపల్లి గురించి తెలియజెపుతూ, భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన రామచంద్రారెడ్డి జీవిత కథతో ప్రముఖ దర్శకుడు నీలకంఠ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. వెదిరె రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్రెడ్డి నిర్మించనున్నారు. శనివారం ఆచార్య వినోబాభావే 127వ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు నివాళులర్పించారు. నీలకంఠ మాట్లాడుతూ ‘ఇది వాణిజ్య చిత్రం కాదు. డాక్యుమెంటరీగా ఉండదు. చాలా శ్రద్ధగా తెరకెక్కించాలనుకుంటున్నాం. రామచంద్రారెడ్డిగారు చేసిన మొదటి భూదానం దేశానికి కొత్త అర్థం చెప్పింది. ఆయన గొప్ప చరిత్రను నేటి తరానికి అందించే ప్రయత్నం చేస్తా’ అన్నారు. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్వర్క్ జరుగుతున్నదని, దేశానికే ఆదర్శంగా నిలిచిన రామచంద్రారెడ్డి జీవిత కథను తెరకెక్కించడం ఆనందగా ఉంది నిర్మాత తెలిపారు. ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా 58లక్షల ఎకరాలు పేదప్రజలకు పంచడం చారిత్రక ఘట్టమని సమర్పకులు అరవింద్రెడ్డి పేర్కొన్నారు.