చిత్రసీమలో అద్భుత విజయాల్ని సాధించిన నాయికలందరిని తాను స్ఫూర్తిగా తీసుకుంటానని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. అనతికాలంలోనే దక్షిణాదిన అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ కూర్గ్ చిన్నది ప్రస్తుతం హిందీ పరిశ్రమలో కూడా మంచి అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది. ఇటీవలే ముంబయిలో ‘గుడ్బై’ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకొని హైదరాబాద్లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్లో పాల్గొంటున్నది. ఈ సందర్భంగా చిత్ర సీమలో తనకు స్ఫూర్తినిచ్చిన కథానాయికల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది రష్మిక మందన్న. మాధురి దీక్షిత్, ఐశ్వర్యరాయ్, కరీనాకపూర్లను తాను ఎంతగానో ఆరాధిస్తానని పేర్కొంది. ఈ మధ్యకాలంలో దీపికాపడుకోన్, అలియాభట్ల నటనకు అభిమానిగా మారిపోయానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘నా అభిమాన నాయికల ఇంటర్వ్యూలు చదివినప్పుడు ఎంతో స్ఫూర్తివంతంగా అనిపిస్తాయి. వారు సాధించిన విజయాల్ని చూస్తే సెల్యూట్ చేయాలనిపిస్తుంది. పరిచయం ఉన్నా లేకపోయినా సరే ప్రతిభావంతులు నాకు వృత్తిలో ప్రేరణనిస్తారు’ అని చెప్పింది.