రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
సమకాలీన ప్రపంచంలో వ్యాపార దృక్పథంతోనే సినిమాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో సమాజంకోసమే సినిమాలు తీస్తున్న అరుదైన వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి ఆర్.నారాయణమూర్తి అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలు ఇతివృత్తంగా దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి తీసిన ‘రైతన్న’ సినిమా ప్రత్యేక ప్రదర్శన ఆదివారం బంజారాహిల్స్లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్లో జరిగింది. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే.శ్రీనివాస్, ఏపీ సోషల్ జస్టిస్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్రావు, పీడబ్ల్యూడీ సంధ్య, ఝాన్సీ, రంగారావు, ఉస్మానియా యూనివర్సిటికీ చెందిన విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి ఈ సినిమాను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో మార్పుకోసం అనుక్షణం తపిస్తూ సినిమాలు తీస్తున్న ఆర్.నారాయణమూర్తి అంటే ప్రత్యేక అభిమానమన్నారు. వ్యవసాయరంగమంటే కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, ప్రపంచంలోని మానవులందరూ మనుగడ సాగించాలంటే ఆహారం లభించాలని, ఆ ఆహారాన్ని ప్రపంచానికి అందించేది రైతు మాత్రమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుచట్టాలు ప్రమాదకరమైనవి అనే అభిప్రాయం తనకుందని, ఈ విషయాన్ని పలు సందర్బాల్లో బహిరంగంగానే మాట్లాడటం జరిగిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను ఉపయోగించి పార్లమెంట్లో రైతు చట్టాలను ఆమోదింపచేసుకున్నారని పేర్కొన్నారు. అయితే రైతు చట్టాలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసిందన్నారు. దేశంలోని అనేక రాష్ర్టాల్లో వివిధ కారణాలతో విపక్షాలు తమ పాత్రను సరిగా పోషించలేకపోతున్న తరుణంలో ఆర్.నారాయణమూర్తి తీసిన ‘రైతన్న’ సినిమా స్ఫూర్తితో ప్రజలే విపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సినిమాను ఇతర భాషల్లోకి కూడా అనువదిస్తే ఆయా రాష్ర్టాల్లో రైతులకు స్పూర్తినిచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతన్న సినిమాలో గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు చూపించారని, అదే విధంగా కార్పొరేట్ రంగ ప్రభావంతో కేంద్ర ప్రభుత్వాలు ఎడాపెడా చట్టాలను రూపొందించి రాష్ర్టాల హక్కులను కూడా హరిస్తున్నాయన్న విషయాన్ని గుర్తు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతన్న సినిమాను తీసానని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు ఆర్.నారాయణమూర్తి తెలిపారు.