ఎల్బీనగర్, జూన్ 25: రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం అందించడం ప్రతిఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన యువకులు రూపొందించిన ‘ఎట్ యువర్ డోర్స్. ఇన్ అనే నూతన యాప్’ను ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలుగకుండా వారు ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా కూరగాయలు, ఇతర సరుకులు ఇంటింటికీ సరఫరా చేస్తారన్నారు. 2030 నాటికి నగరంలో ఉన్న వాహనాల్లో 80 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయన్నారు. ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో యాప్ నిర్వాహకులు జైసింహ, చైతన్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.