నాయకులు, శ్రేణుల సహాయ సహకారాలు మున్ముందూ ఉండాలి
గడువు ముగిసినందున 4 మండలాల టీఆర్ఎస్ కమిటీలు రద్దు
ఈ నెల 15 తరువాత నూతన కమిటీల ప్రకటన: వైరా ఎమ్మెల్యే
వైరా, జూలై 13: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందించారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. మీ సహాయ సహకారాలు భవిష్యత్తులోనూ ఎల్లవేళలా ఉండాలని కోరారు. వైరాలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 5 మండలాల టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేసిన శ్రేణులను ప్రత్యేకంగా అభినందించారు. సంస్థాగత నిర్మాణం కోసం వెన్నంటి ఉండి పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం చేసి నియోజకవర్గంలో టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా నిలిపారన్నారు. టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతోపాటు మండల కమిటీల పదవీకాలం ముగియడంతో వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు మండల కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 15 తర్వాత నూతన కమిటీలను ప్రకటించనున్నట్లు చెప్పారు. మార్క్ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జైపాల్, ఏఎంసీ చైర్మన్ రోశయ్య, ఎంపీపీలు పావని, మధు, సోని, జడ్పీటీసీలు కనకదుర్గ, జగన్, కవిత, ఆత్మకమిటీ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ వైస్చైర్మన్ సీతారాములు, ఐదు మండలాల నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.