“చిలసౌ’ విజయం తర్వాత హీరోగా తనను తాను కొత్త పంథాలో ఆవిష్కరించుకునే కథల్ని ఎంచుకుంటున్నాడు సుశాంత్.ఆ కోవలో అతడు చేసిన మరో మంచి చిత్రమిది’ అని అన్నారు అగ్ర దర్శకుడు త్రివిక్రమ్. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుశాంత్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఎస్.దర్శన్ దర్శకుడు. రవిశంకర్శాస్త్రి, ఏక్తాశాస్త్రి, హరీష్ నిర్మించారు. ఈ నెల 27న విడుదలకానుంది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ప్రపంచం మొత్తం మీద థియేటర్కు రావడానికి సాహసిస్తున్నది ఒక్క తెలుగు జాతి మాత్రమే. మంచి కథల్ని సృష్టిస్తూ మరింత ముందుకు సాగుదాం. ‘అల వైకుంఠపురములో’ చిత్రీకరణ సమయంలో సుశాంత్ నాకు ఈ కథను వినిపించాడు. చాలా నచ్చింది. ఈ సినిమాతో సుశాంత్కు హ్యాట్రిక్ విజయం దక్కాలి’ అని తెలిపారు. ‘కెరీర్ ఆరంభంలో ఇమేజ్ లెక్కలు వేసుకుంటూ సినిమాలు చేశా. ‘చిలసౌ’కు ముందు ఫలితం గురించి ఆలోచించకుండా స్వతంత్రంగా ఆలోచిస్తూ సినిమాలు చేయమని మామయ్య నాగార్జున సలహాలిచ్చారు. ఆయన మాటలతో కొత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టా. నటుడిగా నన్ను విభిన్న కోణంలో చూపించే సినిమా ఇది’ అని సుశాంత్ అన్నారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని దర్శకుడు దర్శన్ పేర్కొన్నారు.