మండలంలోని ఇమాంపేట గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి, సూర్యాపేట-మిర్యాలగూడెం రహదారులకు కూతవేటు దూరంలో ఉన్న ఈ పల్లె గతంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేయడంతో నేడు గ్రామం అందంగా కళకళలాడుతున్నది.
2828 ఎకరాల విస్తీర్ణం, 2431మంది జనాభా ఉన్న ఇమాంపేటను 10 వార్డులుగా విభజించారు. జనాభాలో పురుషులు 1211 మంది, మహిళలు 1220 మంది ఉండగా ఓటర్లు 1260మంది ఉన్నారు. గ్రామంలో మొత్తం ఇండ్లు 803, రేషన్కార్డులు 889 ఉన్నాయి.
గ్రామంలో చేసిన అభివృద్ధి..
గ్రామంలో ప్రతి ఇంటికీ తడి, పొడిచెత్త బుట్టలను పంపిణీ చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్తో వారానికి 3సార్లు ఇంటింటికీ చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు నిర్మించారు. గ్రామంలో పాతబావులు, పాత ఇండ్లను పూడ్చడంతోపాటు పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసి లైన్లు సరిచేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా దాసాయిగూడెం-ఇమాంపేట, సూర్యాపేట-మిర్యాలగూడెం నుంచి గ్రామానికి వచ్చే రోడ్లతోపాటు గ్రామంలోని వీధుల్లో మొక్కలు నాటారు. ప్రతి ఇంటికీ 6 మొక్కలు పంపిణీ చేశారు.
గ్రామంలోని ప్రజలకు, బాటసారులకు పచ్చని ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు రూ.5లక్షలతో సర్వే నంబర్ 146లో 30 గుంటల భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 1500 నుంచి 2000వరకు మొక్కలు నాటారు. ఇప్పటికే మొక్కలు ఏపుగా పెరగడంతో పచ్చని వాతావరణం నెలకొంది. పల్లె ప్రకృతి వనం చుట్టూ ఫెన్సింగ్తోపాటు గేటు ఏర్పాటు చేయడంతో అందంగా, ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది.
మురుగుకాల్వల శుభ్రం
గ్రామంలో మురుగుకాల్వలను పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని ట్రాక్టర్ ద్వారా డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. దీంతో గ్రామంలోని వీధులన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.
గ్రామంలో సుమారు రూ.12.60లక్షలతో ఎకరం స్థలంలో వైకుంఠధామం నిర్మించారు. గ్రామంలో సీసీ రోడ్లు, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు పనులు పూర్తిచేయడంతోపాటు వందశాతం ఇంటి పన్నులు వసూలు చేసినట్లు గ్రామ సర్పంచ్ పాముల ఉపేందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో గ్రామంలో మునుపెన్నడూ చూడని అభివృద్ధి చూస్తున్నామని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసిన ప్రభుత్వానికి, మంత్రి జగదీశ్రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతితో మా గ్రామం అభివృద్ధి చెందింది. గతంలో మా గ్రామం ఏమాత్రం అభివృద్ధికి నోచలేదు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామంలో పచ్చని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొంది. మంత్రి సహకారం, గ్రామస్తుల భాగస్వామ్యంతో మున్ముందు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
–పాముల ఉపేందర్, ఇమాంపేట సర్పంచ్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించాం. పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీ వంటి పనులు వంద శాతం పూర్తి చేశాం. గ్రామంలో సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా గ్రామంలో వందశాతం ఇంటి పన్నులు వసూలు చేశాం.
గ్రామంలో మురుగుకాల్వలు శుభ్రం చేయడం, ఇంటి ముందుకు ట్రాక్టర్ వచ్చి చెత్తను తీసుకెళ్లడం, గ్రామంలో ఆహ్లాద వాతావరణం కోసం పార్కు ఏర్పాటు, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు తదితర నిర్మాణాలతో మా ఊరు రూపురేఖలే మారిపోయాయి. మా గ్రామంలో మునుపెన్నడూ ఇంత అభివృద్ధిని చూడలేదు. ప్రభుత్వానికి, మంత్రి జగదీశ్రెడ్డికి ధన్యవాదాలు.
-మామిడి సరిత, గ్రామస్తురాలు