నల్లగొండ : నెల్లికల్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ చలవతోనే మంజూరైందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు కోసం తానెంతో కష్టపడ్డానని కాంగ్రెస్ నేత జానారెడ్డి అనడం హాస్యాస్పదమని అన్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తానొక్కడినే నెల్లికల్ ప్రాజెక్టు కోసం తపన పడినట్లు జానారెడ్డి చెప్పుకోవడం సరికాదని అన్నారు.
తాను ఎంపీగా ఉన్న సమయంలోనూ అన్ని విధాలా ప్రయత్నం చేశానని గుర్తు చేశారు.
‘తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి అన్ని అనుమతులు వచ్చేలా కృషిచేసి ప్రారంభోత్సవం చేయించాం. ప్రాజెక్టు అనుమతులు కోసం జానారెడ్డి చుట్టపుచూపుగా మాత్రమే తిరిగారు.
కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. పార్టీ మారిన నాయకులు ఈ ఎన్నికల్లో తనను ఓడించాలని చూస్తున్నారని జానారెడ్డి అంటున్నారు. టీడీపీలో గెలిచి, పదవులు అనుభవించిన ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారో ప్రజలకు సమాధానం చెప్పాలి.
నేను, ఎమ్మెల్యే భాస్కర్ రావు పార్టీ మారడానికి నాయకుల మధ్య ఆధిపత్య పోరే ప్రధాన కారణం.
డబుల్ బెడ్రూంల నిర్మాణంపై ప్రశ్నించే అధికారం జానారెడ్డికి లేదు.
ఈ పథకం ప్రారంభం నాటికి జానారెడ్డి సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇండ్ల నిర్మాణం కోసం స్థలం చూపని కారణంగానే నిర్మాణం అలస్యమైంది. తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ పట్టుదల, ఉద్యమ స్ఫూర్తే కారణం.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది.
అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ శిలాఫలకంపై తన పేరు ఉందని గొప్పగా చెప్పిన జానారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణం కూడా చెప్పాలి.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తికావాలంటే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి. అధికార పార్టీతోనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం.
ఏడేండ్లలో సాగర్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో అభివృద్ధి చేసింది. అందుకే ఉప ఎన్నికలో పార్టీ నాయకులు ధైర్యంగా ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.
జానారెడ్డి అసత్య ప్రచారాలు మానుకొని, తన హుందాను కాపాడుకునేలా ప్రచారం చేసుకోవాలి.
తెలంగాణ ప్రజలు, సాగర్ ప్రజలు సీఎం కేసీఆర్ పాలనే తమకు శ్రీరామరక్షగా భావిస్తున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం ఖాయం’ అని సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి