రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు
హుజూరాబాద్ టౌన్, మే 14: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ఎదురులేదని, పార్టీ టికెట్పై గెలిచిన ప్రతి ఒక్కరూ పార్టీ వెంటే ఉన్నారని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు స్పష్టం చేశారు. హుజూరాబాద్ మండలం సింగాపురంలోని గెస్ట్హౌస్లో ఎంపీ కెప్టెన్ను శుక్రవారం టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెప్టెన్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి పార్టీపై, మంత్రులపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ పలు ఇంటర్వ్యూల్లో తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు గులాబీ జెండా పట్టుకుని గెలిచి పదవులు దక్కించుకున్నారని, అందుకనే వారు పార్టీలోనే ఉంటామని స్పష్టం చేస్తున్నారని చెప్పారు. దానిని జీర్ణించుకోలేని మాజీ మంత్రి నాయకులను, కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. ప్రలోభాలకు ఎవరూ లొంగే స్థితిలో లేరని, తమ అధినాయకుడు సీఎం కేసీఆరేనని, తమ కండువా గులాబీయేనని అందరూ ముఖం మీద కొట్టినట్లు చెబుతున్నా ఈటల రాజేందర్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో నూటికి 99 శాతం మంది నాయకులు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని, ఒకరిద్దరు కూడా త్వరలోనే బహిరంగంగా ప్రకటించుకొని వస్తారని చెప్పారు. ఈటల రాజీనామా చేస్తే పార్టీ అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ ఐక్యంగా ఉండి గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కెప్టెన్ స్పష్టం చేశారు. వారి వెంట టీఆర్ఎస్ యువ నాయకుడు సామల రాజారెడ్డి, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి ఆలేటి శ్రీరాం, టీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు ఆకుల వెంకటేశ్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.