ముంబై: ఆదాయ పన్నును ఎగవేసినట్లు వచ్చిన వార్తలను సినీ నటుడు సోనూ సూద్ ఖండించారు. సోనూ సూద్ ఛారిటీ సంస్థ అన్ని రూల్స్ను ఉల్లంఘించినట్లు ఆదాయపన్ను శాఖ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోనూ సూద్ నివాసాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తాను చట్టానికి కట్టుబడే పౌరుడిని అని తెలిపారు. ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, వివరాలను సమర్పించానని, వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, తన పాత్ర తాను పోషించినట్లు సోనూ సూద్ తెలిపారు. అయితే తనిఖీలు నిర్వహించిన ఐటీశాఖ అధికారులు తాను చేసిన పనులను మెచ్చుకున్నారని, తన పనితనానికి గుర్తింపు ఇచ్చినట్లు చెప్పారు. మీరెప్పుడైనా ఇలాంటి డాక్యుమెంట్లు, పేపర్వర్క్ను చూశారా అని ఐటీ అధికారుల్ని అడిగానని, తాము ఎప్పుడూ ఇలాంటి పేపర్ వర్క్ చూడలేదని వారు చెప్పినట్లు సోనూ సూద్ గుర్తు చేశారు. తనకు రెండుసార్లు రాజ్యసభ సీటును ఆఫర్ చేశారని, కానీ ఆ ఆఫర్లను వదులుకున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పుడే రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేనట్లు ఆయన తెలిపారు. దాతృత్వ పనులను ఆపలేదని, ప్రజలకు సేవ చేస్తూంటూనే ఉన్నానన్నారు.