చెన్నై: రాజకీయ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు రజనీకాంత్ ఫుల్స్టాప్ పెట్టేశాడు. భవిష్యత్తులో రాజకీయ ప్రవేశం చేయబోనని ఆయన స్పష్టం చేశారు. తనకు అలాంటి ఉద్దేశం లేదన్నారు. ఇవాళ రజనీ మక్కల్ మండ్రం ఆఫీసు బేరర్లతో జరిగిన సమావేశంలో ఆయన ఈ క్లారిటీ ఇచ్చారు. మక్కల్ మండ్రంను రద్దు చేస్తున్నట్లు తలైవా ప్రకటించారు. ఆరోగ్య కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గత ఏడాది చెప్పిన తలైవా.. ఇవాళ అన్ని జిల్లాలకు చెందిన రజినీ మక్కల్ మంద్రం ఆఫీసు బేరర్లతో భేటీ అయ్యారు. 70 ఏళ్ల రజనీకాంత్ గత ఏడాది రాజకీయ పార్టీ ఆవిష్కరించే దిశగా అడుగులు వేశారు. కానీ 2020 డిసెంబర్లో ఆ ఆశలపై నీళ్లు పోశారు. పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయడం లేదని చెప్పారు. ఆరోగ్యం రీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నట్లు వెల్లడించారు. కరోనా చికిత్స తర్వాత అమెరికా వెళ్లి కొంత విశ్రాంతి తీసుకున్న రజనీ మళ్లీ ఇటీవల చెన్నై చేరుకున్నారు. అయితే రాజకీయాల్లోకి ఎంటర్ కావడం లేదని ఇవాళ మరోసారి స్పష్టం చేశారు.