భోపాల్ : బంధువులు, స్నేహితుల మధ్య పిల్లల పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించాలనుకున్న కుటుంబాలకు కరోనా షాక్ ఇచ్చింది. మహమ్మారితో ఆంక్షల మధ్య ఏర్పాట్లు చేస్తుండగానే వరుడికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. ఈ క్రమంలో వివాహాన్ని వాయిదా వేయాలనుకున్న కుటుంబీకులకు అధికారులు వినూత్న ఐడియా ఇచ్చారు. దీంతో నిర్ణయించిన సుముహూర్తానికి వధూవరులతో పాటు బంధువులంతా పీపీఈ కిట్లు ధరించి తంతును పూర్తి చేశారు. ఇప్పుడు ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో ఆకర్షణగా నిలిచింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రత్లాంలో చోటు చేసుకుంది.
స్థానిక తహసీల్దార్ నవీన్ గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 19న వరుడికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో వివాహాన్ని నిలిపివేయాలని మొదట ప్రయత్నించారు. అయితే సీనియర్ అధికారులు చొరవ తీసుకొని వినూత్నంగా ఆలోచించి, కరోనా వ్యాప్తి చెందకుండా తక్కువ మందితో పీపీఈ కిట్లు ధరించి పూర్తి చేయాలని సూచించారు. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లి తంతును సోమవారం పూర్తి చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. కరోనా మార్గదర్శకాలను పాటించేందుకు బీంద్ ఎస్పీ మనోజ్కుమార్ సింగ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేవలం పది మంది, అంతకంటే తక్కువ మందితో పెళ్లి చేసుకునే జంటకు తన ఇంట్లో విందు ఇస్తానని ప్రకటించారు. అలాగే ఆ జంటలకు మెమెంటోలు ఇస్తామన్నారు. అలాగే వారిని సురక్షితంగా ప్రభుత్వ వాహనాలో ఇంటి వద్ద దిగబెడుతామని చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సామాజిక, మతపరమైన కార్యక్రమాలతో పాటు వివాహ వేడుకలపై ఆంక్షలు విధించింది. వివాహ వేడుకలకు హాజరయ్యే వారికి సంఖ్య 50కి మించొద్దని ఆదేశించింది.